ముందస్తు ముచ్చ‌ట‌పై కేసీఆర్ ప్ర‌క‌ట‌న ఇదే!

గ‌త కొన్నాళ్లుగా తెలంగాణ‌లో ముందస్తు ఎన్నిక‌లు జ‌రుగుతాయ‌ని.. ఎట్టి ప‌రిస్థితిలోనూ వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రిలోనే కేసీఆర్ అసెంబ్లీని ర‌ద్దు చేసుకుని ముందుకు సాగుతార‌ని.. ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్తార‌ని పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. ఇక‌, రాజ‌కీయ నాయ‌కులు కూడా ఇదే విష‌యంపై చ‌ర్చించుకుంటున్నారు. ‘ఇటీవ‌ల జ‌రిగిన మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ విజ‌యం ద‌క్కించుకుంటే.. ఖ‌చ్చితంగా ముందుకు వెళ్తార ని కూడా.. ఒక నిర్ణ‌యానికి వ‌చ్చేశారు. ఎందుకంటే.. టీఆర్ ఎస్ జోష్‌లో ఉండ‌గానే.. ఎన్నిక‌ల‌కు వెళ్తే.. ఆ కిక్కే వేర‌న్న‌ట్టుగా ఉంటుంద‌ని కూడా విశ్లేష‌ణలు వ‌చ్చాయి.

దీనిపై ఒక‌వైపు ఊహాగానాలు లెక్క‌లు సాగుతుండ‌గానే.. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షాలుగా ఉన్న‌ బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ.. ఎన్నిక‌లు ఎప్పుడు వ‌చ్చినా తాము రెడీ అంటూ.. ప్ర‌క‌ట‌న‌లు కుమ్మ‌రించాయి. అంతేకాదు.. స‌వాళ్లు కూడా రువ్వాయి. అయితే.. అస‌లు ఇంత‌కీ ప్ర‌భుత్వాధినేత కేసీఆర్‌.. మ‌న‌సులో ఏముంది? అనేది మాత్రం ఇప్ప‌టి వ‌ర‌కు బ‌య‌ట‌కు రాలేదు. తాను ఏమ‌నుకుంటున్నారు? అనేది కేవ‌లం చ‌ర్చ‌కు మాత్ర‌మే ఆయ‌న వ‌దిలి పెట్టారు. అయితే, తాజాగా ఈ ముంద‌స్తు ఊహాగానాల‌పై కేసీఆర్ ఒక సంచ‌ల‌న ప్ర‌క‌టన చేశారు.

రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన లేదని కేసీఆర్‌ స్పష్టం చేశారు. తాజాగా తెలంగాణ భవన్‌లో జరిగిన టీఆర్ఎస్‌ విస్తృతస్థాయి సమావేశంలో సీఎం కేసీఆర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రాష్ట్రంలో షెడ్యూల్‌ ప్రకారమే శాసనసభ ఎన్నికలు జరుగుతాయని తెలిపారు. పార్టీ శ్రేణులంతా ఎన్నికలకు సిద్ధం కావాలని సూచించారు. ఇప్పటి నుంచే ఎమ్మెల్యేలు, నేతలు ప్రజల్లోనే ఉండాలని దిశానిర్దేశం చేశారు. వచ్చే ఎన్నికలకు సన్నద్ధతపై పార్టీ సమావేశంలో చర్చించారు.

ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే అంశంపై సమావేశంలో చర్చ జరిగింది. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా పరిషత్, డీసీసీబీ, డీసీఎంఎస్, రైతు బంధు జిల్లా కమిటీలు, కార్పొరేషన్ల ఛైర్మన్లతో పాటు పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సమావేశానికి హాజరయ్యారు.