ఈ సడన్ స‌ర్వేలు దేనికి జగనన్నా?

ఏపీ అధికార పార్టీ వైసీపీలో క‌ల‌వ‌రం బ‌య‌లు దేరిందా? ఆ పార్టీపై ప్ర‌జ‌లు ఏమ‌నుకుంటున్నారు? ఎలా రియాక్ట్ అవుతున్నారు? జ‌న‌సేన అధినేత వ్యాఖ్య‌ల‌పై ఎలా స్పందిస్తున్నారు? అని వైసీపీ నేత‌లు ఆలోచన చేస్తున్నారా? అంటే.. తాజాగా జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను బ‌ట్టి ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. ఒక‌వైపు టీడీపీ, మ‌రోవైపు జ‌న‌సేన నేత‌ల దూకుడు, ప్ర‌జ‌ల్లోకి వెళ్తుండ‌డం.. ఇప్ప‌టం వ్య‌వ‌హారం, ప‌వ‌న్ వ్యాఖ్య‌లు, చెప్పులు చూపించ‌డం, వంటి అంశాల‌ పై వైసీపీలో చ‌ర్చ స‌హ‌జంగానే సాగింది.

అయితే, ఈ క్ర‌మంలో ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌జ‌ల ఆలోచన ఇలా ఉంది.. అని భావించిన వైసీపీ నాయ‌కుల‌కు తాజాగా మారిన ప‌రిణామాలు, ప్ర‌ధాని ప‌ర్య‌ట‌న‌, విశాఖ రాజ‌ధాని వ్య‌వ‌హారం, ప‌వ‌న్ రాజ‌కీయ దూకుడు వంటి నేప‌థ్యంలో ప్ర‌జ‌ల నాడి ఎక్క‌డో తేడా కొడుతున్న‌ట్టు అనుమానిస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే తాజాగా వ‌లంటీర్ల ద్వారా వాడ వాడ‌లా స‌ర్వే చేయించాల‌ని రెడీ అయిన‌ట్టు స‌మాచారం. ఈ స‌ర్వే కేవ‌లం రెండు రోజుల్లోనే పూర్తి అయ్యే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది.

తాజాగా వ‌లంటీర్ల‌కు అంద‌రికీ జిల్లా కేంద్రాల్లో శిక్ష‌ణ ఇస్తున్నారు. నిజానికి పైకి మాత్రం ల‌బ్ధిదారుల‌కు ప్ర‌భుత్వ ఫ‌లాలు అందుతున్నాయా లేదా? అనే విష‌యాల‌పై దృష్టి పెడుతున్న‌ట్టు చెబుతున్నా.. వాస్త‌వానికి ఈ విష‌యంపై ప్ర‌భుత్వం ఎప్ప‌టి నుంచో స‌ర్వేలు చేస్తున్న విష‌యం తెలిసిందే, కానీ, తాజాగా ఇప్పుడు చేయాల్సిన అవ‌స‌రం లేదు. అంతేకాదు, ఇప్ప‌టికిప్పుడు రిజ‌ల్ట్ ఇవ్వాల‌ని ఆదేశాలు జారీ చేయాల్సిన ప‌ని కూడా లేదు.

సో.. ఇప్పుడు జరుగుతున్న స‌ర్వే వెనుక రాజ‌కీయ వ్యూహం ఉంద‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు. ప‌వ‌న్ ఎఫెక్ట్ స‌హా ఇటీవ‌ల జ‌రిగిన ఇప్ప‌టం వ్య‌వ‌హారం వంటివాటి విష‌యం పై నిశితంగా తెలుసుకునేందుకు పార్టీ అధిష్టానం ఈ స‌ర్వే చేయిస్తున్న‌ట్టు పార్టీలోనే గుస‌గుస వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. యుద్ధ‌ప్రాతిప‌దిక‌న చేస్తున్న ఈ స‌ర్వే ప్రాధాన్యం సంత‌రించుకుంది. పైకి మాత్రం ల‌బ్ధిదారుల కోసం అంటున్నా.. లోలోన మాత్రం వేరే విష‌యం ఉంద‌ని అంటున్నారు. మ‌రి చివ‌ర‌కు ఏం తేలుస్తారో చూడాలి.