నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారు: గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై

తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ తొలిసారి మీడియా ముందుకు వ‌చ్చారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఏదైనా కార్య‌క్ర‌మానికి హాజ‌రైన‌ప్పుడు మాత్ర‌మే మీడియాతో మాట్లాడేవారు. కానీ, తాజాగా రాజ్‌భ‌వ‌న్‌లో ఆమె ప్రెస్‌మీట్ పెట్టారు. అంతేకాదు.. సంచ‌ల‌న వ్యాఖ్య‌లు సైతం చేశారు. త‌న ఫోన్ల‌ను ట్యాప్ చేస్తున్నార‌నే సందేహం ఉంద‌న్నారు. అంతేకాదు.. ఎమ్మెల్యేల‌కు కోట్లు ఇచ్చి.. కొనుగోలు చేసే ప్ర‌య‌త్నం చేశార‌న్న‌.. ఫామ్‌హౌజ్ ఇష్యూలోనూ త‌న‌ను ఇరికించాల‌ని చూశార‌ని.. సంచ‌ల‌న కామెంట్లు కుమ్మ‌రించారు.

రాజ్‌భవన్‌.. ప్రగతి భవన్‌ కాదని, ఫామ్‌ హౌస్‌ కేసులో రాజ్‌భవన్‌ను ఇరికించాలని చూశారని ఆరోపించారు. గతంలో తుషార్‌ రాజ్‌భవన్‌లో ఏడీసీగా పనిచేశారని, తుషార్‌ పేరును ఉద్దేశపూర్వకంగానే తీసుకొచ్చారని విమర్శించారు. ఏ విషయంపై అయినా మాట్లాడేందుకు సిద్ధమని తమిళిసై స్పష్టం చేశారు. తన‌పై దుష్ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. తన ఫోన్‌ ట్యాప్ అవుతున్నట్టు అనుమానం ఉందని గవర్నర్‌ తమిళిసై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నుంచి కొన్ని బిల్లులు వచ్చాయని తెలిపారు. ఒక్కొక్క బిల్లును సమగ్రంగా పరిశీలిస్తున్నానని, కానీ ఈ లోపే తప్పుడు ప్రచారం జరిగిందని చెప్పారు.

ప్రభుత్వంపై గవర్నర్‌ ప్రశ్నల వర్షం కురిపించారు. కొత్తగా రిక్రూట్‌మెంట్‌ బోర్డు ఎందుకు అన్నదే నా ప్రశ్న?.. 8 ఏళ్లుగా అనేక వీసీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అన్ని యూనివర్సిటీల వీసీలతో మాట్లాడాను. ఆ తర్వాత డీటైల్డ్‌ రిపోర్ట్‌ రూపొందించి ప్రభుత్వానికి పంపా. కొత్త రిక్రూట్‌మెంట్‌ బోర్డు ఏర్పాటుతో ఎలాంటి ఇబ్బందులు వస్తాయి?.. యూజీసీ నిబంధనలకు లోబడి ఉంటుందా?.. లీగల్‌గా ఇబ్బందులు వస్తే ఏంటి పరిస్థితి… మళ్లీ నియమాకాలు ఉంటాయా?.. బోర్డు ఏర్పాటులో ఎలాంటి ప్రోటోకాల్‌ పాటిస్తారు?.. మంత్రి సమాచారం రాలేదని చెప్పడం ఆశ్చర్యంగా ఉంది. రాజ్‌భవన్‌.. ప్రగతి భవన్‌ కాదు. విద్యార్థులు ఎవరైనా నేరుగా రాజ్‌భవన్‌ రావచ్చు అని తమిళిసై ప్రకటించారు.

స‌ర్కారు రియాక్ష‌న్ ఏంటి?

ప్రభుత్వం, గవర్నర్‌ మధ్య మరింత దుమారం రాజుకుంది. యూనివర్సిటీల చట్ట సవరణ బిల్లు విషయంలో తాజాగా వివాదం మొదలైంది. ఈ బిల్లుపై చర్చించడానికి నేరుగా విద్యా శాఖ మంత్రి రాజ్‌భవన్‌కు రావాలని గవర్నర్‌ తమిళిసై ప్రభుత్వానికి లేఖ రాశారు. దానిని నేరుగా సీఎం ముఖ్య కార్యదర్శికి పంపారు. దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎలా స్పందిస్తారనే అంశం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లో ఏళ్ల తరబడి పెద్ద ఎత్తున పోస్టులు భర్తీ కాకుండా మిగిలిపోయాయి. దాంతో, వీటి భర్తీ కోసం రాష్ట్ర ప్రభుత్వం కామన్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డును ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

ఈ బోర్డుకు అధికారాలను కల్పించడానికి యూనివర్సిటీల చట్ట సవరణ బిల్లును శాసనసభ సెప్టెంబరు 12న ఆమోదించి, గవర్నర్‌ ఆమోదం కోసం పంపించింది. అప్పటి నుంచి ఈ బిల్లుపై గవర్నర్‌ ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు. ఈ నేపథ్యంలో, బిల్లుపై సందేహాలు ఉన్నాయని, వాటిపై చర్చించేందుకు విద్యా శాఖ మంత్రి రావాల్సిందిగా గవర్నర్‌ ఈనెల 7న ముఖ్యమంత్రి కార్యాలయానికి లేఖ పంపించారు. ఇక‌, తాజా విమ‌ర్శ‌ల నేప‌థ్యంలో ప్ర‌భుత్వం ఎలా రియాక్ట్ అవుతుంద‌నేది ఆస‌క్తిగా మారింది.