మునుగోడు పొలిటికల్ టాక్ ఆఫ్ ద టౌన్ కేటీఆర్‌

మునుగోడులో అధికార టీఆర్ఎస్ విజ‌యం ద‌క్కించుకుంది. అయితే.. ఈ విజ‌యంలో సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌లు ప‌క్కా ప్లానింగ్‌తో ముందుకు సాగారు. ఇదే విజ‌యానికి దోహ‌దం చేసింద‌నే కామెంట్లు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా నియోజ‌క‌వ‌ర్గాన్ని ద‌త్త‌త తీసుకుంటాన‌న్న కేటీఆర్ వ్యాఖ్య‌లు ప్ర‌జ‌ల‌ను బాగానే మ‌లుపుతిప్పాయి. అదేస‌మ‌యంలో దేశంలోనే భూగర్భ జలాల్లో ఫ్లోరిన్‌ ఎక్కువగా ఉన్న ప్రాంతం మునుగోడు నియోజకవర్గం. ఈ ఫ్లోరైడ్‌ రక్కసిని పారదోలడానికి సీఎం కేసీఆర్‌ మిషన్‌ భగీరథను నల్గొండ జిల్లా నుంచే ప్రారంభించారు.

గత నాలుగైదేళ్లలో ఒక్క ఫ్లోరైడ్‌ కేసు కూడా నమోదు కాకపోవడం వంటి అంశాలను టీఆర్ఎస్‌ ప్రధానంగా ఈ ఎన్నికల్లో ప్రస్తావించింది. ఇతర పార్టీలు ఈ ప్రాంతానికి ఏం చేశాయో చెప్పాలని నిలదీసింది. తమ పార్టీకి అవకాశం ఇస్తే రూ.వేల కోట్లతో మరింత అభివృద్ధి చేస్తామని, యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని నేతలు హామీలు గుప్పించారు. అంతేకాకుండా, అభ్యర్థి కూసుకుంట్ల ప్ర‌భాక‌ర్‌రెడ్డిని గెలిపిస్తే మునుగోడును దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తానంటూ మంత్రి కేటీఆర్‌ హామీ ఇవ్వడం కూడా విజయావకాశాలను పెంచింది.

ఇదిలావుంటే, ప్ర‌త్య‌ర్థుల‌పై క‌త్తులు నూరడం.. కౌంట‌ర్లు ఇవ్వ‌డం కూడా టీఆర్ఎస్‌కు విజయాన్ని చేరువ చేసింది. బీజేపీ అభ్య‌ర్థి కోమ‌టిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి రూ.18వేల కాంట్రాక్టు కోసమే కాంగ్రెస్‌ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరారని.. ఆయన వ్యక్తిగత లాభం కోసమే ఈ ఎన్నికలు వచ్చాయని ఆరోపిస్తూ కేటీఆర్‌ జోరుగా ప్రచారం చేశారు. దీనికి తోడు ఆ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలంతా ఇదే అంశాన్ని ప్రధాన అస్త్రంగా మలచుకొని ప్రజల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.

కేసీఆర్‌ను తిట్టి ఓట్లు అడగడం తప్ప రాష్ట్రానికి, మునుగోడుకు కేంద్ర ప్రభుత్వం నుంచి భాజపా నేతలు ఏమైనా తీసుకొచ్చారా? అని సూటిగా ప్రశ్నించడంతో పాటు గతంలో దుబ్బాక, హుజూరాబాద్‌ నియోజకవర్గాలకు నిధులు తెస్తామని చెప్పి మోసం చేశారంటూ విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. అలాగే, కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డికి కాంట్రాక్టుల పేరిట ఇవ్వాలనుకున్న ఆ రూ.18 వేల కోట్లు మునుగోడు అభివృద్ధి కోసం ఇస్తామని మోడీ, అమిత్ షా హామీ ఇస్తే తాము ఉప ఎన్నిక నుంచి వైదొలుగుతామని కూడా స‌వాల్ చేయ‌డం.. కేటీఆర్ వ్యూహాన్ని మ‌రింత ప‌దును ప‌ట్టేలా చేశాయి. దీంతో టీఆర్ఎస్ విజ‌యం న‌ల్లేరుపై న‌డ‌క కాక‌పోయినా.. ఉత్కంఠ పోరులో విజ‌యం ద‌క్కించుకుని, పైచేయి సాధించామ‌నే సంతృప్తిని మిగిల్చింద‌ని చెప్పాలి.