మునుగోడు వార్ వన్ సైడ్ కాదు..

ఎగ్జిట్ పోల్స్ దగ్గర నుంచి సగటు ఓటరు వరకు మునుగోడు ఉప ఎన్నికల్లో గెలుపు ఎవరిది? అంటే.. టీఆర్ఎస్ ది అంటూ ఆత్మవిశ్వాసంతో చెప్పటం తెలిసిందే. ముందు అనుకున్నట్లు కాకున్నా.. ఉప ఎన్నిక ప్రచారం సాగిన కొద్దీ.. టీఆర్ఎస్ అన్ని విభాగాల్లో సంపూర్ణ అధిక్యతను ప్రదర్శించినట్లుగా చెబుతున్నారు. దీనికి తగ్గట్లే ఎగ్జిట్ పోల్స్ సైతం టీఆర్ఎస్ కు విజయం ఖాయమని స్పష్టం చేయటం తెలిసిందే. ఇక.. ముఖ్యమంత్రికి అందిన ప్రత్యేక నివేదికలోనూ పోలైన ఓట్లలో యాభై శాతం ఓట్లు తమ పార్టీ అభ్యర్థికే పడ్డాయని.. గెలుపు సునాయాసమని స్పష్టం చేయటం తెలిసిందే.

ఇదిలా ఉంటే.. తాజాగా వెలువడుతున్న ఫలితాల్ని చూస్తున్న వారు..ఆశ్చర్యానికి గురవుతున్నారు. పోస్టల్ బ్యాలెట్ చూసినప్పుడు టీఆర్ఎస్ అధిక్యత ఒక మోస్తరుగా ఉంటే.. దానికి కొనసాగింపుగా మొదటి రౌండ్ లో టీఆర్ఎస్ అధిక్యత ఒక మోస్తరుగా ఉన్నా.. అనుకున్నంతగా లేదన్న మాట వినిపిస్తోంది. మొదటి రౌండ్ లో ఉన్న 1352 లీడ్ ను రెండో రౌండ్ లో బీజేపీ అధిగమించటమే కాదు.. 789 ఓట్ల అధిక్యతలోకి బీజేపీ వెళ్లటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

రౌండ్.. రౌండ్ కు ఫలితం ఇదే రీతిలో మారితే మాత్రం.. పరిస్థితి అంచనాలకు భిన్నంగా ఉంటుందంటున్నారు. ఇప్పటివరకు వార్ వన్ సైడ్ అనుకున్న దానికి భిన్నంగా వార్ మామూలుగా లేదని.. పోటాపోటీగా సాగుతుందన్న మాట ఇప్పటివరకు వెలువడిన ఫలితాలు స్పష్టం చేస్తున్నాయని చెబుతున్నారు. అయితే.. రెండో రౌండ్ లో టీఆర్ఎస్ అధిక్యతలో ఉంది తప్పించి.. బీజేపీ కాదని చెబుతున్నారు. అయితే.. మొదటి రౌండ్ లో ఉన్న అధిక్యత తగ్గి.. నాలుగు అంకెల స్థానే మూడు అంకెల (563 ఓట్లు) అధిక్యత మాత్రమే లభించినట్లు చెబుతున్నారు. అదే సమయంలో మూడో రౌండ్ విషయానికి వస్తే.. బీజేపీ అధిక్యతలోకి వచ్చినట్లుగా చెబుతున్నారు. ఇలా.. రౌండ్ రౌండ్ కు మారే ఫలితం చూస్తే.. ఉప ఎన్నిక అంతిమ ఫలితాన్ని అంచనా వేయటం కష్టమని చెప్పక తప్పదు.