తెలంగాణ టీడీపీ అధ్య‌క్షుడిగా కాసాని.. బీసీల కోస‌మేనా?

తెలంగాణ టీడీపీ కొత్త అధ్యక్షుడిగా కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ నియమితులయ్యారు. ఇప్పటిదాకా తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న బక్కని నర్సింహులును పార్టీ అధినేత చంద్రబాబు టీడీపీ పొలిట్ బ్యూరోలోకి తీసుకున్నారు. ఆయన స్థానంలో కాసానిని కొత్త అధ్యక్షుడిగా నియమించారు. బక్కని నర్సింహులును జాతీయ కార్యదర్శిగా నియమించారు. మరోవైపు ఈ నెల 10న కాసాని జ్ఞానేశ్వర్ తెలంగాణ టీడీపీ అధ్యక్ష బాధ్యతలు చేపడతారు.

కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ ఇటీవలే తెలుగుదేశం పార్టీలో చేరారు. తెలంగాణ ముదిరాజ్ మహాసభ అధ్యక్షుడిగా ఉన్న ఆయన చంద్రబాబు సమక్షంలో హైదరాబాద్‌లో టీడీపీలో చేరారు. జ్ఞానేశ్వర్‌కు చంద్రబాబు టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాసాని 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. కాసాని గతంలో ఎమ్మెల్సీగా, రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్మెన్ గానూ పనిచేశారు. ఇక, కొన్నాళ్లుగా కాసాని రాజ‌కీయాల‌కు దూరంగా ఉన్నారు. అయితే, ఇటీవ‌ల చంద్ర‌బాబు పిలుపుతో ఆయ‌న టీడీపీ తీర్థం పుచ్చుకున్నార‌ని తెలుస్తోంది.

అయితే, వ‌చ్చే ఎన్నిక‌ల‌ను దృష్టిలో పెట్టుకునే చంద్ర‌బాబు కాసానిని పార్టీలోకి తీసుకున్నార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇప్పుడు తాజాగా ఆయ‌న కు ఏకంగా తెలంగాణ పార్టీ ప‌గ్గాలు ఇవ్వ‌డంపై నాయ‌కులు చ‌ర్చ చేస్తున్నారు. రాష్ట్రంలో బీసీల‌ను ఏకం చేయ‌డంతోపాటు వ‌చ్చే ఎన్నిక‌ల్లో బీసీల‌ను టీడీపీకి అనుకూలంగా మార్చ‌డంపైనా కాసాని ప‌నిచేయాల్సి ఉంటుంద‌ని చెబుతున్నారు. తెలంగాణ‌లో బీసీల ఓట్లు 65 శాతం పైనే ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో చంద్ర‌బాబు వ్యూహాత్మ‌కంగా బ‌ల‌మైన నాయ‌కుడిగా ఉన్న బీసీ నేత కాసాని జ్ఞానేశ్వ‌ర్‌కు పార్టీప‌గ్గాలు అప్ప‌గించార‌ని చెబుతున్నారు. మ‌రి ఈయ‌న ఏమేర‌కు పార్టీని డెవ‌ల‌ప్ చేస్తారో చూడాలి. ఏదేమైనా తాజా నిర్ణ‌యంపై త‌మ్ముళ్లు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు.