న‌ర‌సాపురం ఎంపీ టికెట్‌పై.. తేల్చేసిన ప‌వ‌న్‌?

ఉమ్మ‌డి ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలోని కీల‌క‌మైన పార్ల‌మెంటు స్థానం న‌ర‌సాపురం. ఇక్క‌డ రాజుల హ‌వా ఎక్కువ‌గా ఉంటుంది. గ‌త ఎన్నిక‌లు ముందు అంటే 2014లోబీజేపీ గెలిచింది. గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ గెలుపుగుర్రం ఎక్కింది. ఇక‌, బీజేపీతో ఎప్పుడు పొత్తు పెట్టుకున్నా టీడీపీ ఈ స్థానాన్ని ఆ పార్టీకే ఇచ్చేసిన హిస్ట‌రీ ఉంది. దీంతో అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో టీడీపీ బ‌లంగా ఉన్నా.. పార్ల‌మెంటు స్థాయిలో మాత్రం టీడీపీ పెద్ద‌గా పుంజుకున్న‌దాఖ‌లా లేదు. గ‌త ఎన్నిక‌ల్లో ఎవ‌రికి వారుగా పోటీ చేసిన నేప‌థ్యంలో జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ టికెట్‌ను మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబుకు కేటాయించారు.

వాస్త‌వానికి నాగ‌బాబుకుఅదే తొలి ఎన్నిక అందునా క్ష‌త్రియ సామాజిక వ‌ర్గం హ‌వా ఎక్కువ‌గా ఉన్న నేప‌థ్యంలో ఆయ‌న పోటీ మ‌రింత ఆసక్తిగా మారింది. గ‌ట్టిపోటీ ఇస్తారులే అనుకుంటే ఆయ‌న పెద్ద‌గా పోటీ ఇవ్వ‌లేక పోయారు. ఈ క్ర‌మంలో 2 ల‌క్ష‌ల 50 వేల ఓట్లు సాధించారు. అయితే, వైసీపీ త‌ర‌ఫున పోటీ చేసిన ర‌ఘురామ‌కు 4ల‌క్ష‌ల 47 వేల ఓట్లు వ‌స్తే, టీడీపీకి రెండో స్థానం ద‌క్కింది. ఈ పార్టీ త‌ర‌ఫున పోటీ చేసిన శివ‌రామ‌రాజుకు 4 ల‌క్ష‌ల 15 వేల ఓట్లు వ‌చ్చాయి. దీంతో నాగ‌బాబు థ‌ర్డ్ ప్లేస్‌కు జారి పోయారు. ఇక‌, ఆ తర్వాత పెద్ద‌గా ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టించింది లేదు.

అయిన‌ప్ప‌టికీ వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఓడిన చోటే గెల‌వాల‌నే ప‌ట్టుతో ఉన్నార‌ని తెలుస్తోంది.ఇటీవ‌ల విశాఖ‌ ప‌ర్య‌ట‌న‌కు కూడా నాగబాబు వ‌చ్చారు. ఇదిలా వుంటే, తాజాగా న‌ర‌సాపురం టికెట్‌మ‌ళ్లీ నాగ‌బాబుకే కేటాయించిన‌ట్టు తెలుస్తోంది. నేరుగా ప‌వ‌న్ ఈ విష‌యాన్ని చెప్ప‌క‌పోయినా.. తాజాగా జ‌రిగిన పీఏసీ స‌మావేశంలో ప‌శ్చిమ గోదావ‌రి విష‌యం ప్ర‌స్తావ‌న‌కు వ‌చ్చింది. ఈ స‌మ‌యంలో ఈ జిల్లాలో ఉన్న ఏకైక నియోజ‌క వ‌ర్గంలో వైసీపీ దూకుడు ఎక్కువ‌గా ఉంద‌ని క‌నీసం త‌మ‌ను బ్యాన‌ర్లు కూడా క‌ట్ట‌నివ్వ‌డం లేదని జన‌సేన నాయ‌కులు ఫిర్యాదు చేశారు.

ఈ సంద‌ర్భంగా ప‌వ‌న్ స్పందిస్తూ.. అదంతా నాగ‌బాబు చూసుకుంటాడులే. త్వ‌ర‌లోనే ఆయ‌న వ‌స్తారు. అని చెప్పార‌ట‌. దీంతో ఈ టికెట్‌ను ఆయ‌న‌కే కేటాయించే అవ‌కాశం ఉంద‌ని జ‌న‌సేన వ‌ర్గాల్లో చ‌ర్చ‌సాగుతుండ‌డం గ‌మ‌నార్హం. అయితే, ఆయ‌న గ‌త అనుభ‌వాల దృష్ట్యా ఇప్ప‌టి నుంచి లైన్‌క్లియ‌ర్ చేసుకునేలా ప‌నిచేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. పైగా క్ష‌త్రియ వ‌ర్గాన్ని మెప్పించాలి. కాపు ఓట్లు ఉన్నా.. డామినేష‌న్ మాత్రం క్ష‌త్రియుల‌దే కావ‌డం గ‌మ‌నార్హం. మ‌రి నాగ‌బాబు ఏం చేస్తారో చూడాలి.