జగన్-వర్మ.. ఈ లాజిక్ ఎలా మిస్సయ్యారు?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రహస్యంగా 40 నిమిషాలకు పైగా భేటీ అయ్యారన్న వార్త చర్చనీయాంశంగా మారింది. తమ రాజకీయ ప్రత్యర్థులైన తెలుగుదేంశం అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేనాని పవన్ కళ్యాణ్‌లను టార్గెట్ చేస్తూ సినిమాలు తీసే విషయమై వీళ్లిద్దరి మధ్య చర్చ జరిగినట్లుగా జోరుగా ప్రచారం జరుగుతోంది.

జగన్ ప్రోత్సాహంతో వర్మ మూడు సినిమాలు తీయబోతున్నట్లుగా వార్తలొస్తున్నాయి. పవన్ మూడు పెళ్ళిళ్ళు, తెలుగుదేశం-జనసేన బంధం లాంటి అంశాలపై ఈ సినిమాలు తయారు కాబోతున్నట్లుగా చెబుతున్నారు. ఐతే ఈ వార్తలు నిజమే అయితే జగన్ సినిమా అనే కొరివితో ఇప్పుడు తల గోక్కోబోతున్నట్లే అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఎత్తుగడ కచ్చితంగా బూమరాంగ్ అవుతుందనే చర్చ నడుస్తోంది

అధికారంలో ఉన్న పార్టీ, నేతలను టార్గెట్ చేస్తూ, బురదజల్లుతూ సినిమాలు తీస్తే ఎంతో కొంత వర్కవుట్ అవుతుంది కానీ ప్రతిపక్షంలో ఉన్న వారి మీద ఇలాంటి సినిమాలు తీసి అధికార పార్టీ ప్రయోజనం పొందడం అన్నది దాదాపుగా జరగదు. బలవంతుడు బలహీనుల మీద దాడి చేస్తే అవతలి వర్గం మీద సానుభూతి వస్తుందే తప్ప జనాలకు వేరే ఫీలింగ్ కలగదు. బలవంతుడి మీద సానుకూల అభిప్రాయం రాదు.

వైసీపీ ప్రతిపక్షంలో ఉండగా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ లాంటి సినిమా తీసి ఆ పార్టీకి ఉపయోగపడ్డ వర్మ.. జగన్ పార్టీ అధికారంలోకి వచ్చాక ‘అమ్మరాజ్యంలో కడప బిడ్డలు’ అనే సినిమా తీస్తే జనాలు కనీసం పట్టించుకోలేదు. అందులోనూ ఇప్పుడు జగన్ సర్కారు మీద అంతకంతకూ వ్యతిరేకత పెరిగిపోతున్న సమయంలో ప్రతిపక్షాల మీద బురదజల్లుతూ సినిమా తీయడం అంటే కచ్చితంగా అది కొరివితో తల గోక్కున్నట్లే. ఇది వైసీపీకి ప్లస్ కాకపోగా మైనస్ అవుతుంది. పైగా వర్మ సినిమా అంటే జనాలకు ఇప్పుడు ఏమాత్రం పట్టింపులేదు.

‘కొండా’ సహా వర్మ నుంచి వచ్చిన సినిమాలను థియేటర్లకు వెళ్లి చూసిన జనాలను వేళ్ల మీద లెక్కబెట్టొచ్చు. ఒక ఫిలిం మేకర్‌గా వర్మ పూర్తిగా పతనం అయిపోయాడు. నాసిరకం సినిమాలతో తన విలువను పూర్తిగా పోగొట్టుకున్నాడు. ఇలాంటి దర్శకుడిని నమ్మి ఆయన మార్కు చీప్ సినిమాలు తీయించి జగన్ అండ్ కో పొందే ప్రయోజనం ఏంటన్నది ప్రశ్న. నిజంగా ఈ టైంలో వర్మ తమను టార్గెట్ చేస్తూ వర్మ సినిమాలు చేయడం నిజమే అయితే.. చంద్రబాబు, పవన్ వాటిని స్వాగతించాలి. ఆ సినిమాలు వారికి ప్లస్సే తప్ప మైనస్ కాదు.