గ‌తం గుర్తు చేస్తున్న టీడీపీ న‌యా గేమ్‌… వైసీపీకి చుక్క‌లేనా!

టీడీపీ వ్యూహాలు అదిరిపోతున్నాయా?వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకునే క్ర‌మంలో సామ‌దాన బేధ దండోపాయాల‌ను ప్ర‌యోగించే దిశ‌గా టీడీపీ రెడీ అయిందా.? అంటే.. ఔననే అంటున్నారు తెలుగు త‌మ్ముళ్లు. ఒక‌వైపు.. వైసీపీపై యుద్ధం చేస్తూనే.. మ‌రోవైపు త‌మ‌తో క‌లిసి వ‌చ్చే పార్టీల‌ను క‌లుపుకొని ముందుకు సాగాల‌ని.. టీడీపీ నిర్ణ‌యించింది. ఈ క్ర‌మంలో ఇప్ప‌టికే.. జన‌సేన‌తో టీడీపీ అధినేత చంద్ర‌బాబు చేతులు క‌లిపారు. ఇక‌, క‌లిసి వ‌చ్చే పార్టీలు రావాల‌ని కూడా.. చంద్ర‌బాబు పిలుపునిచ్చారు. ఇదిలావుంటే.. వైసీపీపై యుద్ధాన్ని మ‌రింత తీవ్ర‌త‌రం చేసేలా ముందుకు సాగుతున్నారు.

ఈ క్ర‌మంలో ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన ప‌రిణామాల‌ను ప్ర‌జ‌ల‌కు ప‌దే ప‌దే గుర్తు చేయాల‌ని టీడీపీ అధినేత ప‌క్కా స్కెచ్ సిద్ధం చేశార‌ని త‌మ్ముళ్లు చెబుతున్నారు. వైసీపీ అధికారంలోకి వ‌చ్చిన నాటి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు.. రాష్ట్రంలో చోటు చేసుకున్న కీల‌క ప‌రిణామాల‌ను గుదిగుచ్చి.. త‌క్కువ నిడివితో ఎక్కువ‌గా ఆలోచించేలా.. వీడియోలు రూపొందిస్తున్న‌ట్టు తెలిసింది. దీనికి టీడీపీలోని ఐటీ విభాగం 24 గంట‌లు క‌స‌ర‌త్తు చేస్తోంద‌ని త‌మ్ముళ్లు చెబుతున్నారు. ఎన్నిక‌ల‌కు ఆరు మాసాల ముందు నుంచి నిత్యం ఈ వీడియోల‌ను పుంఖాను పుంఖాలుగా.. సోష‌ల్ మీడియాలో రిలీజ్ చేయనున్నారు.

“మ‌నం మ‌రిచిపోయిన వైసీపీ దాష్టీకాలు” టైటిల్‌తోనే వీడియోలు ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్లాల‌ని.. నిర్ణ‌యించుకున్న‌ట్టు తెలుస్తోంది. వీటి క‌ర‌క‌ట్ట‌పై ప్ర‌జావేదిక‌ను కూల్చివేసిన ఘ‌ట‌న.. రైతుల‌పై పోలీసులు చేసిన లాఠీ చార్జి… రైతుల ఉద్య‌మాలు.. అమ‌రావ‌తి రాజ‌ధానికి అనుకూలంగా.. హైకోర్టు ఇచ్చిన తీర్పులు.. అసెంబ్లీలో జ‌గ‌న్ మ‌డ‌మ తిప్ప‌డాలు.. శాస‌న మండ‌లి ర‌ద్దు.. మ‌ళ్లీ పున‌రుద్ధ‌ర‌ణ‌.. చంద్ర‌బాబు స‌తీమ‌ణిపై చేసిన కామెంట్లు.. త‌ర్వాత‌.. చంద్ర‌బాబు విల‌పించ‌డం.. వంటి కీల‌క అంశాల‌ను సిరీస్‌గా రూపొందిస్తున్నారు.

అదేస‌మ‌యంలో హిందూపురం ఎంపీ.. గోరంట్ల మాధ‌వ్ న్యూడ్ ఎపిసోడ్‌ను మ‌రింత‌గా ప్ర‌జ‌ల్లోకి తీసుకురానున్నారు. దీనిపై ప్ర‌భుత్వం ముందు చ‌ర్య‌లు తీసుకుంటాన‌ని చెప్పి.. త‌ర్వాత‌.. చేతులు ఎత్తేసిన విష‌యం.. కూడా ప్ర‌స్తావిస్తారు. ప్ర‌భుత్వాన్ని నిల‌దీసినందుకు.. టీడీపీ కేంద్ర కార్యాల‌యంపై జ‌రిపిన దాడి ఘ‌ట‌న‌లు.. ప‌ల్నాడులో టీడీపీ నేత‌ల‌పై విరుచుకుప‌డ్డ‌.. మాచ‌ర్ల ఎమ్మెల్యే ఉదంతం… చంద్ర‌బాబు ఇంటిపై.. జోగి ర‌మేష్ దాడికి య‌త్నం.. భారీ ఎత్తున గంజాయి ప‌ట్టుకోవ‌డాలు.. బూతులు తిట్టిన నేత‌లు.. మాద‌క ద్ర‌వ్యాల‌కు కేంద్రంగా ఏపీ మార‌డం.. ఇలా.. విభాగాల వారీగా.. ప్ర‌జ‌లు దాదాపు మ‌రిచిపోయిన అన్ని సంగ‌తుల‌ను రికార్డు చేసిన‌.. టీడీపీ వ్యూహాత్మ‌కంగా వీటిని ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు తెస్తోంద‌ట‌. మ‌రి ఏం చేస్తారో చూడాలి.