డిసెంబర్లో అసెంబ్లీ రద్దవుతుందా ?

అవుననే అంటున్నారు తెలుగుదేశం పార్టీ నేతలు. అప్పులు పుట్టని దుస్థితిలో వేరే దారిలేక అసెంబ్లీని వచ్చే డిసెంబర్లో జగన్మోహన్ రెడ్డి రద్దు చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమామహేశ్వరరావు జోస్యం చెప్పారు. వచ్చే ఏడాది మేనెలలోగా అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశాలున్నట్లు తమకు ఢిల్లీ వర్గాలు చెప్పినట్లు చెప్పారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఎదుర్కోవటానికి తమ పార్టీ సిద్దంగా ఉందని బోండా అన్నారు.

ఎన్నికల్లో తమతో కలిసొచ్చే పార్టీలేవి అన్న విషయాలను ఎన్నికల సమయంలో మాత్రమే ఆలోచిస్తామని కూడా బోండా చెప్పారు. మూడున్నరేళ్ళల్లో ప్రభుత్వ ఖజానాను జగన్మోహన్ రెడ్డి ఖాళీ చేసేసినట్లు బోండా మండిపడ్డారు. రాష్ట్రాన్ని సమర్ధవంతంగా నడిపే శక్తి జగన్ కు లేదని ఇప్పటికే నిరూపణైందని బోండా ఎద్దేవా చేశారు. సీబీఐ, ఈడీ, వివేకా మర్డర్ కేసులు తన మెడకు చుట్టుకోకుండా ఉండేందుకే జగన్ రాష్ట్ర ప్రయోజనాలను కేంద్రానికి తాకట్టు పెట్టేశారని బోండా మండిపడ్డారు.

రాష్ట్రంలో ఉద్యోగాలు లేక యువత ఇబ్బందులు పడుతున్న విషయంలో జగన్ కు ఎలాంటి పట్టింపు ఉన్నట్లు లేదని బోండా అనుమానం వ్యక్తం చేశారు. ఉద్యోగాలు, ఉపాధి లేక యువత ఆత్మహత్యలు చేసుకుంటుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. కొత్త పరిశ్రమలు రాష్ట్రానికి రాకపోతే ఉన్నవి కూడా బయటకు వెళ్ళిపోతున్నాయంటు ధ్వజమెత్తారు. ప్రభుత్వ విధానాల వల్లే యువత భవిష్యత్తు అధ్వాన్నంగా తయారైందన్నారు.

ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కలిసొచ్చే పార్టీలను కలుపుకుని వెళతామన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేయాల్సిన పోరాటాలను పార్టీల పరంగానా లేకపోతే నాన్ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో చేయాలా అనే ఆలోచన కూడా చేస్తున్నట్లు చెప్పారు. జై భీమ్ పార్టీ అధినేత జడ శ్రవణ్ కుమార్ తమ అధినేత చంద్రబాబు నాయుడు ను కలిసి ఇదే విధమైన సూచన చేసిన విషయాన్ని బోండా ప్రస్తావించారు. తొందరలోనే ఈ విషయమై స్పష్టత వస్తుందని వెంటనే కార్యాచరణ ప్రకటిస్తామని బోండా చెప్పారు.