ఎత్తుకు పై ఎత్తు.. బీజేపీ గుండెల్లో ‘కారు’ ప‌రుగులు!!

తెలంగాణలో టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం తామేనని ధీమాతో ఉన్న బీజేపీ నేతలకు అధికార టీఆర్ఎస్ పార్టీ షాకులిస్తోంది. ఓ విధంగా చెప్పాలంటే టీఆర్ఎస్ వ్యూహంలో బీజేపీ చిక్కుకుందనే చెప్పొచ్చు. రాష్ట్రంలో బీసీ సామాజికవర్గం అజెండాతో బీజేపీ ముందుకుపోతోంది. ఇదే సామాజికవర్గానికి చెందిన నేతలను టీఆర్ఎస్‌లో చేర్చుకుని కమలం పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. వరుసగా బీజేపీకి ఆ పార్టీ నేతలు గుడ్‌బై చెబుతున్నారు. దీంతో తెలంగాణ బీజేపీలో కలవరం మొదలైంది. గురువారం భిక్షమయ్య గౌడ్, నేడు దాసోజు, స్వామిగౌడ్‌ బీజేపీకి రాజీనామా చేశారు. మునుగోడు ఉపఎన్నిక వేళ బీజేపీకి బీసీ నేతలు దూరమవుతున్నారు.

అలాగే జితేందర్ రెడ్డి, విఠల్, ఏనుగు రవీందర్ రెడ్డిలు బీజేపీని వీడుతున్నట్లు ప్రచారం జరిగింది. ఆ ప్రచారాన్ని సదరు నేతలు ఖండించారు. మాజీమంత్రి దేవేందర్ గౌడ్ తనయుడు వీరేందర్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్‌లకు మంత్రి కేటీఆర్ ఫోన్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో బీజేపీ నేతలు అప్రమత్తమయ్యారు. దిద్దుబాటు చర్యలకు ఆ పార్టీ అధిష్టానం దిగింది. పార్టీని వీడొద్దంటూ నేతలను అధిష్టానం బుజ్జగిస్తోంది. మ‌రోవైపు మునుగోడు ఉప ఎన్నికలో గౌడ సామాజిక వర్గ ఓట్లు కీలకంగా మారడంతో టీఆర్ఎస్‌, బీజేపీ పోటాపోటీ వ్యూహాలతో ముందుకు సాగుతున్నాయి.

మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ ను చేర్చుకుని బీజేపీ పైచేయి సాధించగా.. వెంటనే రంగంలోకి దిగిన టీఆర్ఎస్‌ నష్ట నివారణ చర్యలు ప్రారంభించింది. ఇప్పటికే గౌడ సామాజిక వర్గానికి చెందిన కాంగ్రెస్‌ ఎంపీపీ పల్లె జ్యోతితో పాటు ఆమె భర్త పల్లె రవికుమార్‌గౌడ్‌ను పార్టీలో చేర్చుకుంది. మాజీ ఎంపీ స్థాయి నేత బీజేపీలో చేరడంతో టీఆర్ఎస్‌ బలహీనపడిందన్న భావన ప్రజల్లో లేకుండా ఉండేందుకు… అదే సామాజిక వర్గానికి చెందిన బూడిద బిక్షమయ్యగౌడ్‌ను టీఆర్ఎస్‌లో చేర్చుకున్నారు. ఇదిలావుంటే, బీజేపీ సైతం మునుగోడులో గౌడగర్జన సభను నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఎలా చూసుకున్నా రెండు పార్టీలు వ్యూహ ప్ర‌తి వ్యూహాల‌తో ముందుకు సాగుతుండ‌డం గ‌మ‌నార్హం.