ఎవ‌రి ఖ‌ర్గే.. కాంగ్రెస్ అధ్య‌క్షుడిగా ఎలా ఎదిగారు?

కాంగ్రెస్ అధ్య‌క్ష పీఠంపై ద‌ళిత సామాజిక వ‌ర్గానికి చెందిన క‌ర్ణాట‌క నాయ‌కులు.. 86 ఏళ్ల మ‌ల్లికార్జున ఖ‌ర్గే కూర్చొన‌బోతున్నారు. ఆయ‌న ఎన్నిక ముందుగానే ఊహించింది. అయినా.. ఎన్నిక‌లు జ‌రిగిన ద‌రిమిలా.. భారీ మెజారిటీతోఆయ‌న గెలుపు గుర్రం ఎక్కారు. అయితే… ఇంత పెద్ద పోస్టుకు ద‌క్షిణాది నాయ‌కులు.. పైగా.. ద‌ళితుడు అయిన‌.. ఖ‌ర్గే ఎలా అందుకున్నారు? ఆయ‌న ఎదిగిన తీరు ఏంటి? అంతా.. ఆస‌క్తిక‌రం..

మల్లికార్జున ఖర్గే.. విద్యార్థి దశ నుంచే నాయకత్వ లక్షణాలను పుణికిపుచ్చుకున్నారు. అంచెలంచెలుగా ఎదిగి క‌ర్ణాట‌క‌లోని కలబురిగి పట్టణ కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 9 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. మూడు పర్యాయాలు సీఎం అవకాశాలను కోల్పోయినా ఏమాత్రం నిరాశ చెందలేదు. పార్టీపై తిరుగుబావుటా ఎగరేయలేదు. అధిష్ఠానం ఆదేశాల మేరకు కేంద్ర రాజకీయాల్లోకి వెళ్లి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుతం రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా కొనసాగుతున్నారు. ప్రారంభం నుంచి గాంధీ కుటుంబానికి విశ్వాసపాత్రుడిగా పని చేస్తున్న ఖర్గేకు మంచి పేరుంది. ఈ నేపథ్యంలో రాజకీయ అనిశ్చితిని తొలగించేందుకు గాంధీ కుటుంబమే ఖర్గేను బరిలోకి దించిందన‌డంలో సందేహం లేదు.

ఇక‌, అతి పెద్ద కాంగ్రెస్ పార్టీకి దక్షిణభారతం నుంచి అధ్యక్ష పీఠాన్ని అధిరోహించిన‌ ఆరోనేతగా మల్లిఖార్జున ఖర్గే రికార్డు సృష్టించారు. ఇప్పటి వరకు పట్టాభి సీతారామయ్య, నీలం సంజీవరెడ్డి, కె.కామరాజ్‌, యస్‌.నిజలింగప్ప, పీవీ నర్సింహారావు పార్టీ అధ్యక్షులుగా వ్యవహరించారు. దాదాపు రెండున్నర దశాబ్దాల తర్వాత గాంధీయేతర వ్యక్తి పార్టీ పగ్గాలు చేపట్టడం ఇదే తొలిసారి. 1969లో కలబురిగి పట్టణ కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా ఎన్నికైన ఖర్గే.. 1972లో తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఆ తర్వాత వరుసగా 8 సార్లు తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు.

1976లో తొలిసారిగా దేవరాజ్‌ ప్రభుత్వంలో మంత్రిగా వ్యవహరించారు. ఆ తర్వాత కర్ణాటకలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన ప్రతిసారి ఆయన్ని మంత్రిగా నియమించేవారు. 1996-99, 2008-09 మధ్య కాలంలో అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగానూ వ్యవహరించారు. 2005-08 మధ్య కర్ణాటక ప్రదేశ్‌ కమిటీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. 2009లో తొలిసారిగా జాతీయ రాజకీయాల్లో అడుగుపెట్టారు. మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వంలో కార్మికశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆ తర్వాత రైల్వే మంత్రిత్వశాఖతోపాటు న్యాయశాఖ బాధ్యతలు కూడా చేపట్టారు. ఈ అనుభవంతో పార్టీని ఖర్గే ముందుకు తీసుకెళ్లగలరని పార్టీ అధిష్ఠానం భావిస్తోంది.

2019లో తొలి ఓటమి
ఓటమి ఎరుగని రాజకీయవేత్తగా పేరు తెచ్చుకున్న ఖర్గేను 2019లో పరాజయం పలకరించింది. సార్వత్రిక ఎన్నికల్లో ఆయన తొలిసారిగా ఓడిపోయారు. దీంతో ఆయన పనితీరును, సేవలను గుర్తించిన పార్టీ అధిష్ఠానం ఫిబ్రవరి 2021లో పార్టీ తరఫున ఆయన్ను రాజ్యసభకు పంపించింది. అప్పటి నుంచి రాజ్యసభలో ప్రతిపక్షనేతగా ఖర్గే వ్యవహరిస్తున్నారు.