టీఆర్ఎస్ కు మరో భారీ షాక్.. త్వరలో చిచ్చా గుడ్ బై..?

అధికార పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితికి మరో భారీ షాక్ తగలబోతోందా..? ఆ పార్టీకి చెందిన ఉద్యమ నేత మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే కమలం తీర్థం పుచ్చుకోబోతున్నారా..? మునుగోడు ఉప ఎన్నిక తర్వాత కీలకమైన పరిణామాలు జరగబోతున్నాయా..? మరో ఉప ఎన్నిక భారం తెలంగాణపై పడనుందా..? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి.

ఇవి ఊహాగానాలు కాదు నిజమేననే భావన కలుగుతోంది. ఎందుకంటే ఈ వ్యాఖ్యలు చేసింది ఎవరో కాదు.. బీజేపీ ఎంపీ లక్ష్మణ్ వ్యాఖ్యలతో ఆ ఎమ్మెల్యే ఎవరోనన్న చర్చ జోరుగా సాగుతోంది. అయితే ఆయన చిన్న క్లూ వదలడంతో ఆ మాజీ మంత్రి పేరు బయటికొచ్చినట్లు అయింది. ఇంతకీ లక్ష్మణ్ ఏమన్నారంటే.. హైదరాబాద్ నగరానికి చెందిన ఒక ఉద్యమకారుడు మాజీ మంత్రి త్వరలో టీఆర్ఎస్ కు రాజీనామా చేయబోతున్నారని.. త్వరలో మరో ఉప ఎన్నిక రానుందని జోస్యం చెప్పారు.

దీంతోనే ఆయన ఎవరో చెప్పకనే చెప్పారు. ఉప ఎన్నిక వస్తుంది అంటే సిట్టింగ్ ఎమ్మెల్యే అని అర్థం. ప్రస్తుత ఎమ్మెల్యేగా ఉండి గ్రేటర్ కు చెందిన మాజీ మంత్రి ఎవరా అని ఆరా తీస్తే అది సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావుగా తేలింది. ప్రత్యేక తెలంగాణ కోసం ఉద్యమంలో ముందు వరుసలో ఉండి కొట్లాడిన నేతల్లో కేసీఆర్ తర్వాత పద్మరావు ఉంటారు. కార్పొరేటర్ గా రాజకీయ జీవితం మొదలుపెట్టి అంచెలంచెలుగా ఎదిగిన పద్మారావు తొలి ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు.

రెండోసారి టీఆర్ఎస్ అధికారం చేపట్టగానే తేడా కొట్టింది. తన సమకాలీనుడిగా ఎదుగుతున్న పద్మారావును కేసీఆర్ పక్కన పెట్టారు. రెండోసారి మంత్రి పదవి ఇవ్వకుండా డిప్యూటీ స్పీకర్ పదవితో సరిపెట్టారు. దీంతో నొచ్చుకున్న ఆయన అప్పటి నుంచీ గుమ్మనంగా ఉండి తన నియోజకవర్గానికే పరిమితం అయ్యారు. అయితే కేసీఆర్ కుమారుడు కేటీఆర్ మాత్రం ఆయనను ప్రేమగా చిచ్చా అని పిలుచుకునేవారు. వీరిద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది.

అయితే ఏమైందో ఏమో చిచ్చా ఇటీవల పెద్దగా బయటికి రావడం లేదు. దీన్ని గమనించే బీజేపీ గాలం వేసినట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్ ముందుగా మేల్కొని నష్ట నివారణ చర్యలు చేపట్టకపోతే మాత్రం కారు టైరు పంక్చర్ కావడానికి ఎంతో సమయం పట్టదు. ఇప్పటికే మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ పార్టీని వీడగా.. ఇపుడు పద్మారావు పేరు వినపడుతోంది. ఇంకా ఎంతమంది ఈ వరుసలో ఉన్నారనే టెన్షన్ అధికార పార్టీకి పట్టుకుంది. చూడాలి మరి ఏం జరుగుతుందో..