ప్ర‌జాస్వామ్య ప‌రిర‌క్ష‌ణే ధ్యేయం.. చేతులు క‌లిపిన ప‌వ‌న్‌-బాబు!

టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఐదేళ్ల తరువాత సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జనసేన, టీడీపీ ఉమ్మడిగా ప్రెస్‌మీట్ నిర్వహించారు. ప్రెస్‌మీట్‌లో చంద్రబాబు మాట్లాడుతూ…ప్ర‌జాస్వామ్యం కోసం.. ప‌వ‌న్‌తో క‌లిసి ప‌నిచేస్తామ‌న్నారు. అన్ని పార్టీల‌ను క‌లుపుకొని వైసీపీపై పోరు సాగిస్తామ‌న్నారు. పవన్‌పై ప్రభుత్వ విధానం సరికాదన్నారు. పవన్‌కు సానుభూతి తెలిపేందుకు వచ్చానని చంద్రబాబు తెలిపారు. పవన్ మీటింగ్ పెట్టుకున్నరోజే ప్రభుత్వ కార్యక్రమం సరికాదని సూచించారు. పవన్‌ విశాఖ వదిలి వెళ్లేవరకు ఆంక్షలు పెట్టారని పేర్కొన్నారు. పవన్ వెళ్లే దారిలో లైట్లు కూడా తొలగించడం దారుణమన్నారు.

ఒకేరోజు ఎప్పుడు రెండు పార్టీల సమావేశాలు జరగలేదన్నారు. రెండు పార్టీల నేతలు ఎదురుకాకుండా పోలీసులు చూసుకుంటారని చెప్పారు. కానీ విశాఖలో పోలీసుల తీరు ఇందుకు విరుద్ధంగా వ్యవహరించారని మండిపడ్డారు. పవన్‌ను నడిరోడ్డుపై నిలబెట్టే ప్రయత్నం చేశారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలపై దాడులు చేసి తిరిగి తమపైనే కేసులు పెడతారా? అని చంద్రబాబు ప్రశ్నించారు. దాడులు చేయడం.. కేసులు పెట్టడం, జైలులో వేయడం దారుణమన్నారు. ప్రతిపక్షాలపై ఇష్టానుసారం మాట్లాడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎదురుతిరిగితే కేసులు, దాడులతో భయపెడుతున్నారని పేర్కొన్నారు.

ఏపీలో ప్రజాస్వామ్యం అపహాస్యం అవుతోందన్నారు. వైసీపీ హింసలు భరించలేక చాలా మంది ఆత్మహత్య చేసుకున్నారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పాలనను 40 ఏళ్లలో ఎప్పుడూ చూడలేదన్నారు. శారీరకంగా, మానసికంగా బాధపెట్టి పైశాచిక ఆనందం పొందుతున్నారని మండిపడ్డారు. కొందరు పోలీసులు దారుణంగా ప్రవర్తిస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాల కార్యక్రమాలపై అడుగడుగునా ఆంక్షలా? అని ప్రశ్నించారు.

రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. అందుకు అన్ని పార్టీలు కలిసి రావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. రాజకీయ నేతలకే రక్షణ లేదు.. ఇక ప్రజలకేం రక్షణ కల్పిస్తారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలపై ప్రశ్నించే స్వేచ్ఛ ప్రజలకు లేకుండా చేశారని వ్యాఖ్యానించారు. అన్ని పార్టీల తక్షణ కర్తవ్యం ప్రజాస్వామ్య పరిరక్షణ అన్నారు. ప్రజా సమస్యలపై నిలదీస్తాం.. అవసరమైతే మెడలు వంచుతామన్నారు. అన్ని పార్టీలు కలిసి ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం చర్చించాలన్నారు.