ఈ ప్రశ్నలకు కేసీఆర్ వద్ద ఆన్సరుందా?

కేసీయార్ బీఆర్ఎస్ జాతీయ పార్టీ ఏర్పాటుపై సోషల్ మీడియాలో నెటిజన్లు పెద్ద ఎత్తున మండిపోతున్నారు. కేసీయార్ జాతీయ పార్టీ పై రాజకీయ పార్టీలు నెగిటివ్ గా స్పందించటం లేదు. బీజేపీ నేతలు మాత్రం కాస్త ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. వైసీపీ నేతలు కేసీయార్ పార్టీని పెద్దగా పట్టించుకోలేదు. టీడీపీ నేతలు మాత్రం సున్నితంగానే వ్యతిరేకతను తెలిపారు. సరే పార్టీ నేతలుగా ఎవరెలా స్పందించినా సోషల్ మీడియాలో మాత్రం నెటిజన్లు విపరీతంగా నెగిటవ్ వైఖరి చూపిస్తున్నారు.

జాతీయపార్టీ ప్రకటించే సమయంలో జాతీయ భావన కారణంగానే తాను టీఆర్ఎస్ ను జాతీయ పార్టీగా మార్చినట్లు కేసీఆర్ చెప్పారు. ఈ పాయింట్ మీద ఎక్కువగా విరుచుకుపడుతున్నారు. ప్రత్యేక తెలంగాణా కోసం ఉద్యమాలు చేసి వేలాది మంది యువకుల మృతికి కారణమైన వ్యక్తి జాతీయవాది ఎలాగవుతాడంటు రెచ్చిపోతున్నారు. రాష్ట్ర విభజనకు కారణమైన వ్యక్తులను జాతీయ భావాలున్న వ్యక్తులుగా ఎవరైనా చెబుతారా అంటు నిలదీస్తున్నారు.

అలాగే కరోనా వైరస్ కష్టకాలంలో వైద్యం కోసం ఏపీ నుంచి హైదరాబాద్ చేరుకునేందుకు ప్రయత్నించిన వేలాదిమందిని రాష్ట్ర సరిహద్దుల్లోనే నిలిపేసిన వ్యక్తి జాతీయ భావాలున్న వ్యక్తి ఎలాగవుతారంటు నిలదీస్తున్నారు. అప్పట్లో కేసీయార్ వైఖరి కారణంగానే వందలాది మంది రోగులు చనిపోయిన విషయంపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. సరిహద్దుల్లో పోలీసులను కాపలాపెట్టి అంబులెన్సుల్లో వచ్చిన రోగులను కూడా కేసీయార్ అడ్డుకున్నది వాస్తవం కాదా అంటు గుర్తుచేస్తున్నారు.

ఉద్యమంలో భాగంగా సీమాంధ్రకు చెందిన ఎందరో మహనీయుల విగ్రహాలను ధ్వంసం చేయించిన కేసీఆర్ జాతీయ భావాలున్న వ్యక్తి ఎలాగవుతాడని సూటిగా అడుగుతున్నారు. ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత సీమాంధ్రులపై విషం చిమ్మిన, ఇప్పటికీ విభజన సమస్యల పరిష్కారానికి సహకరించని వ్యక్తి జాతీయ భావనలున్నట్లు చెప్పుకోవటమే విచిత్రంగా ఉందంటు నెటిజన్లు మండిపోతున్నారు. రాజకీయంగా కేసీయార్ పై విమర్శలు, ఆరోపణలు చేయాలంటే ఎవరికైనా భయం, మొహమాటం ఉండచ్చు. కానీ నెటిజన్లుగా స్పందించటంలో జనాలు ఎవరికీ భయపడాల్సిన అవసరంలేదు కదా. అందుకనే స్వేచ్చగా కేసీయార్ పార్టీపై జనాలు రెచ్చిపోతున్నారు.