పాల‌పిట్ట వివాదం.. సీఎం కేసీఆర్ చిక్కుకున్నారా?

తెలంగాణ సీఎం కేసీఆర్ వివాదంలో చిక్కుకున్నారు. సెంటిమెంట్ కోసం అధికారులను రిస్క్‌లో పడేసారని ఆయనపై విమర్శలు వస్తున్నాయి. దసరా రోజు పాలపిట్టను చూస్తే శుభమని తెలంగాణలో ఆచారం ఉంది. దీంతో పాలపిట్టను చూడడం కోసం ముఖ్యమంత్రి ప్రగతి భవన్‌కు ఆ పిట్ట‌ను తెప్పించుకున్నారు. దీనిపైనే ఇప్పుడు విమర్శలు వస్తున్నాయి. రాష్ట్ర పక్షిగా పాల‌పిట్టను అధికారికంగా ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. దీని ప్ర‌కారం.. ఈ ప‌క్షిని బంధించ‌డం.. పెంచ‌డం.. చంపి తిన‌డం కూడా నేరం కింద‌కే వ‌స్తుంది.

అయితే.. ద‌స‌రా రోజు అదే పాల పిట్ల‌ను పంజరంలో బంధించి తీసుకొచ్చి సీఎం కుటుంబానికి అధికారులు చూపించారు. దీనిని సీఎం కేసీఆర్ కూడా మెచ్చుకున్నారు. పాల‌పిట్ట‌కు న‌మ‌స్క‌రించిన ఫొటోలు కూడా వైర‌ల్ అయ్యాయి. అయితే.. పాల పిట్ట విష‌యంలో ప్రభుత్వ సిబ్బందితోపాటు సీఎం చేసిన ఈ చర్యపై జంతు ప్రేమికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

నిజానికి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ప్రకారం పాలపిట్టను బంధించడం నేరం. యాక్ట్ ఉల్లంఘనలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకునేందుకు వీలుగా కేంద్ర, రాష్ట్ర స్థాయిలో ప్రత్యేకంగా వైల్డ్ లైఫ్ బోర్డులు కూడా ఏర్పాటు చేశారు.

తెలంగాణ రాష్ట్రానికి వైల్డ్ లైఫ్ బోర్డు చైర్మన్‌గా సీఎం కేసీఆర్ ఉండ‌డం గ‌మ‌నార్హం. అలాంటిది ముఖ్యమంత్రి తన కోసం పాలపిట్టను బంధించి తనవద్దకు తెప్పించుకోవడాన్ని జంతుప్రేమికులు వ్యతిరేకిస్తున్నారు. వన్యప్రాణుల చట్టానికి చైర్మన్‌గా ఉండి.. వాటిని రక్షించాల్సిన సీఎం నిబంధనలు ఉల్లంఘించడంపై విమర్శలు వెళ్లువెత్తున్నాయి.

తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అధికార పక్షి పాలపిట్టను ఒక పంజరంలో బంధించి దసరా రోజున సీఎం కేసీఆర్, ఆయన కుటుంబసభ్యులు దర్శించిన తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రగతి భవన్‌కు పాలపిట్టను తెప్పించుకోవడం వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్‌కు విరుద్ధమని జంతు ప్రేమికులు అంటున్నారు. ఈ నేప‌థ్యంలో ఎవ‌రైనా.. దీనిపై ఫిర్యాదు చేస్తే.. సీఎం కేసీఆర్‌, ఆయన కుటుంబ స‌భ్యులు.. అధికారుల‌పైనా..కేసు న‌మోదు చేసే వీలుంద‌ని.. అంటున్నారు.