పాలిటిక్స్‌పై చిరు సెల్ఫ్ ట్రోల్


దాదాపు మూడు ద‌శాబ్దాల పాటు తెలుగు సినిమాను ఏలిన రారాజు మెగాస్టార్ చిరంజీవి. సినీ రంగంలో అనిత‌ర సాధ్య‌మైన స్థాయిని అందుకుని, అంద‌రి వాడిగా పేరు తెచ్చుకుని కోట్లాది మంది అభిమానుల‌ను సంపాదించుకున్న ఆయ‌న‌.. రాజ‌కీయాల్లో మాత్రం చేదు అనుభ‌వం ఎదుర్కొన్నారు. ఎన్టీఆర్ రికార్డును బ‌ద్ద‌లు కొడుతూ పార్టీ పెట్టాక అతి త‌క్కువ స‌మ‌యంలో ముఖ్య‌మంత్రి అయిపోదామ‌ని ఆయ‌న చేసిన ప్ర‌య‌త్నం బెడిసికొట్టింది.

2009 ఎన్నిక‌ల్లో ప్ర‌జారాజ్యం పార్టీ ఘోర ప‌రాభ‌వం ఎదుర్కోవ‌డం, రెండేళ్లు తిరిగేలోపు పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయ‌డం, ఆ పార్టీలో కేంద్ర మంత్రిగా మూడేళ్లు ప‌ని చేసి ఆ త‌ర్వాత నెమ్మ‌దిగా రాజ‌కీయాల‌కు చిరు దూరం అయిపోవ‌డం తెలిసిందే. ఆ త‌ర్వాత ఎప్పుడు రాజ‌కీయాల ప్ర‌స్తావ‌న వ‌చ్చినా చిరు అది త‌న‌కు స‌రిప‌డ‌ని రంగం అన్న‌ట్లే మాట్లాడుతున్నారు. అందులో ఉన్న‌న్నాళ్లూ కూడా అయిష్టంగానే ఉన్న‌ట్లు వ్యాఖ్యానిస్తున్నారు.

తాజాగా అల్లు రామ‌లింగ‌య్య శ‌త జ‌యంతి ఉత్స‌వాల్లో చిరు త‌న రాజ‌కీయ ప్ర‌యాణం గురించి అనుకోకుండా ప్ర‌స్తావించారు. ఈ విష‌యంలో తన మీద తాను సెల్ఫ్ ట్రోల్ వేసుకున్నారు. ఆర్టిస్టుగా సెటిలైన త‌ర్వాత మ‌రో వ్యాప‌కం వైపు, మ‌రో వ్యాపారం వైపో నేను వెళ్ల‌లేను.. అని చిన్న పాస్ ఇచ్చిన చిరు… పాలిటిక్స్‌లోకి వెళ్లావు క‌దా అనొద్దే. అది మ‌ధ్య‌లో ట్రై చేశాను. దాని గురించి వ‌దిలేసేయండి అని వ్యాఖ్యానించాడు.

త‌న ప్ర‌సంగంలో చిరు చాలా పంచ్‌లు వేసిన‌ప్ప‌టికీ.. త‌న గురించి తాను వేసుకున్న ఈ పంచ్ బాగా వైర‌ల్ అయింది. ఐతే దీన్ని స‌ర‌దాగా తీసుకున్న వాళ్లు కొంత‌మందైతే.. చిరు మీద సీరియ‌స్ అయిన వాళ్లు ఇంకొంత‌మంది. స‌రైన ప్ర‌ణాళిక లేకుండా రాజ‌కీయాల్లోకి దిగి.. ఒక వైఫ‌ల్యం ఎదురు కాగానే రెండేళ్ల‌కే పార్టీని అప్ప‌టిదాకా తిట్టిపోసిన కాంగ్రెస్‌లో విలీనం చేసేసి.. కేంద్ర మంత్రి ప‌ద‌విని అనుభ‌వించి, ప‌ద‌వీ కాలం పూర్తయిన కొంత కాలానికే కాంగ్రెస్‌తో పాటు రాజ‌కీయాల‌కు ముఖం చాటేయ‌డం గురించి ప్ర‌స్తావిస్తూ చిరును విమ‌ర్శిస్తున్నారు నెటిజ‌న్లు.