కూల్చివేతకు ముందు.. సచివాలయం లోపల ఏం జరిగిందంటే?

సోమవారం అర్థరాత్రి తర్వాత.. మంగళవారం తెల్లవారు జాము ప్రాంతంలో సచివాలయ భవనాల్ని కూల్చి వేస్తూ పనులు షురూ చేయటం తెలిసిందే. గుట్టుచప్పుడు కాకుండా తీసుకున్న నిర్ణయాన్ని అత్యంత రహస్యంగా ప్రభుత్వాధికారులు అమలు చేశారు. భారీ ఎత్తున యంత్రాల్ని రాత్రివేళ తీసుకొచ్చి.. భవనాల కూల్చివేత పనుల్ని మొదలుపెట్టారు. సచివాలయ భవనాల్ని కూల్చివేయటానికి ముందు సచివాలయం లోపల చాలానే కార్యక్రమాలు జరిగినట్లుగా తెలుస్తోంది.

సచివాలయ ప్రాంగణంలో నల్లపోచమ్మ గుడితో పాటు.. మసీదు కూడా ఉంది. అయితే.. సచివాలయ ప్రాంగణం మొత్తం నేలమట్టం చేయాల్సిన నేపథ్యంలో.. అనివార్యంగా గుడిని.. మసీదును సైతం తీసివేయాల్సిన అవసరం ఉంది. ఈ కార్యక్రమాన్ని మతపెద్దల సమక్షంలో నిర్వహించినట్లుగా చెబుతున్నారు. భవనాల కూల్చివేత విషయాన్ని అత్యంత పైస్థాయి అధికారుల వరకే సమాచారం ఉంది. కిందిస్థాయి సిబ్బందికి తెలియనివ్వలేదు. రాష్ట్ర డీజీపీ స్వయంగా పర్యవేక్షించిన ఈ వైనంలో క్రమపద్దతిలో కార్యక్రమాల్ని నిర్వహించారు.

కూల్చివేత కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్.. డీజీపీ మహేందర్ రెడ్డిలు స్వయంగా పర్యవేక్షించారు. ఇందుకోసం ఎనిమిది భారీ ప్రొక్లెయిన్లు.. జేసీబీలను ఉపయోగించారు. కూల్చివేతకు కాస్త ముందుగా హడావుడిగా నల్లపోచమ్మ గుడిలో పెద్ద ఎత్తున హోమాన్ని నిర్వహించారు. అనంతరం ఆలయంలోని మూలవిరాట్టును అక్కడి నుంచి తరలించారు. ముస్లిం మత పెద్దల్ని పిలిపించి.. మసీదులోని మతగ్రంధాల్ని అప్పగించారు.

కూల్చివేత విషయంలో ప్రభుత్వ ప్రాధాన్యతను అత్యున్నత అధికారులు ఎంతలా గుర్తించారన్న దానికి నిదర్శనంగా తెల్లవారుజామున నాలుగు గంటల వరకూ రాష్ట్ర సీఎస్.. డీజీపీలు స్వయంగా సచివాలయం వద్దనే ఉండటాన్ని చెప్పొచ్చు. అర్థరాత్రి పన్నెండు గంటలకు మొదలైన కూల్చివేత పనులు తొలిరోజున పలు భవనాల్ని కూల్చేశారు. నల్లపోచమ్మ గుడి.. మసీదు.. సి బ్లాక్ భనాన్ని 15 శాతం.. జి బ్లాక్ భవనం యాభై శాతం.. హెచ్ బ్లాక్ నార్త్.. సైత్ లను 20 శాతం మేర కూల్చారు.

డి బ్లాక్ కూల్చివేత పనులు మంగళవారం సాయంత్రం మొదలయ్యాయి. ఇక.. ఏపీకి అప్పగించిన జె..కె బ్లాకులతోపాటు తెలంగాణ అధీనంలో ఉన్న ఎ.. బి బ్లాకుల్ని ఇంకా కూల్చివేయటం షురూ కాలేదు. కూల్చివేత ప్రక్రియ మొదలు కావటానికి కొన్ని గంటల ముందు నాలుగువైపులా కిలోమీటరు దూరాన బారికేడ్లు ఏర్పాటు చేసి ట్రాఫిక్ ను మళ్లించటం గమనార్హం.