అయ్య‌న్న‌ను అక్క‌డే తొక్కేస్తా: వైసీపీ ఎమ్మెల్యే

ఉత్త‌రాంధ్ర‌లోని న‌ర్సీపట్నం రాజ‌కీయాలు మ‌రింత రాజుకున్నాయి. ఇక్క‌డ మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు.. అయ్య‌న్న‌కు.. ప్ర‌స్తుత ఎమ్మెల్యే వైసీపీ నాయ‌కుడు.. పెట్ల ఉమా శంక‌ర్ గ‌ణేశ్‌కు మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే.. భ‌గ్గుమ‌నే ప‌రిస్థితి ఉంది. ఇరువురూ కూడా రాజ‌కీయంగా తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శించుకుంటారు. అయితే.. అయ్య‌న్న‌పై ఇప్పుడు.. తాజాగా పెట్ల తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. సీఎం జ‌గ‌న్ తీసుకున్న నిర్ణ‌యంతో విశాఖ రాజ‌ధాని న‌గ‌రం అవుతుంద‌న్న ఆయ‌న‌.. దీనిని అడ్డుకునేందుకు టీడీపీ చేస్తున్న ప్ర‌య‌త్నాల‌ను ప్ర‌జ‌లు తిప్పికొడతార‌న్నారు.

మూడు రాజ‌ధానుల‌కు వ్య‌తిరేకంగా అమ‌రావ‌తి రైతులు చేస్తున్న పాద‌యాత్ర‌ను పెయిడ్ యాత్ర‌గా పేర్కొన్నారు. అరసవల్లి సూర్యభగవానుడిని ద‌ర్శించుకోవాలంటే.. కారులోనో, బస్సులోనో, రైల్లోనో వెళ్లాలని, అందులో ఎలాంటి తప్పు లేదని అన్నారు. కానీ పాదయాత్రగా ఎందుకు వస్తున్నారని రైతుల‌ను ప్రశ్నించారు. గొడవలు సృష్టించి ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలను దెబ్బతీయాలని చూస్తే మాత్రం సహించేది లేదని అన్నారు. ఇదేస‌మ‌యంలో చింతకాయల అయ్యన్నపాత్రుడికి కూడా హెచ్చరికలు జారీ చేశారు.

అయ్య‌న్న పాత్రుడు.. రైతుల పాద‌యాత్ర‌లో పాల్గొంటే తీవ్ర ప‌రిణామాలు ఉంటాయ‌ని చెప్పారు. రైతుల పాదయాత్రకు ఆయన అండగా వస్తే అక్కడే తొక్కేస్తానని ఎమ్మెల్యే హెచ్చరించారు. విశాఖ‌కు రాజ‌ధాని రాకుండా అడ్డుకునే వారిని ప్ర‌జ‌లు త‌రిమి కొడ‌తార‌ని చెప్పారు. ఏ మొహం పెట్టుకుని.. అమ‌రావ‌తి రైతుల‌కు అయ్య‌న్న మ‌ద్ద‌తిస్తున్నాడ‌ని ప్ర‌శ్నించారు. ఎన్టీ రామారావు తెలుగువారి గుండెల్లో ఉన్న మాట నిజమే కానీ, ఆయన గురించి మాట్లాడే నైతిక హక్కు అయ్యన్నకు లేదన్నారు.

ప్ర‌స్తుతం వైసీపీ ఎమ్మెల్యే పెట్ల వ్యాఖ్య‌లు రాజ‌కీయంగా దుమారం రేపుతున్నాయి. దీనిపై అయ్య‌న్న ఎలా రియాక్ట్ అవుతారో చూడాల‌ని ప‌రిశీల‌కులు అంటున్నారు. గుడివాడ‌లో ప్ర‌స్తుతం జ‌రుగుతున్న పాద‌యాత్ర‌కు స్థానిక టీడీపీ నాయ‌కులు స‌హా.. ఇరుగు పొరుగు జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున నాయ‌కులు వ‌చ్చి .. సంఘీభావం తెలిపారు.