రేవంత్ రాంగ్ టైమింగ్

తానేం చేస్తున్నాడో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కైనా అర్ధమవుతోందా లేదా అనే సందేహాలు పెరిగిపోతున్నాయి. పీసీసీ ఆఫీసు బేరర్ల సంఖ్యను పెంచటంతో పాటు జిల్లా కాంగ్రెస్ కమిటిల్లో మార్పులు చేయాలని డిసైడ్ అయ్యారు. సరిగా పనిచేయని డీసీసీ అద్యక్షులను మార్చేసి కొత్తవారిని నియమించాలని రేవంత్ అనుకున్నారు. ఇందుకనే కేరళలో పాదయాత్రలో ఉన్న రాహుల్ గాంధీని కలిసి గ్నీన్ సిగ్నల్ తెచ్చుకున్నారు.

ఇంతవరకు బాగానే ఉంది కానీ అసలు రేవంత్ నిర్ణయం తీసుకున్న సమయమే చాలా తప్పుగా ఉంది. మునుగోడు ఉపఎన్నిక ముందు అవసరమా ఇపుడు ? అనే చర్చ కూడా మొదలైంది. మునుగోడు ఉపఎన్నికలో గెలవాలని ఒకవైపు చెబుతునే మరోవైపు డీసీసీ అధ్యక్షులను మార్చాలని నిర్ణయించుకోవటం తెలివైన పనికాదు. ఎందుకంటే తాను పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నది కాంగ్రెస్ పార్టీకన్న విషయాన్ని రేవంత్ మధ్యమధ్యలో మరచిపోతున్నట్లున్నారు.

రేవంత్ కాదన్న వాళ్ళు నేరుగా ఢిల్లీకి వెళ్ళి తాము అనుకున్నది సాధించుకొస్తారు. ఈ విషయం ఇప్పటికే రేవంత్ కు చాలాసార్లు అనుభవమైంది. అయినా డీసీసీ అధ్యక్షులుగా తన మద్దతుదారులను నియమించుకోవాలనే ఆలోచన రేవంత్ లో పోలేదు. రేవంత్ మార్చినా వెంటనే సదరు నేతలు ఢిల్లీకి వెళ్ళి వెంటనే రేవంత్ నియమాకాలను రద్దు చేయించుకొస్తారు. ఎందుకంటే అధిష్టానం దగ్గర తనకెంత పలుకుబడుందని రేవంత్ అనుకుంటున్నారో అంతే పలుకుబడి మిగిలిన నేతలకు కూడా ఉందన్నది వాస్తవం.

సరిగ్గా ఉపఎన్నిక ముందు రాష్ట్ర కమిటీని విస్తరించటం, డీసీసీ అద్యక్షులను మార్చాలని అనుకోవటం రేవంత్ కు మంచిది కాదు. అదేదో ఉపఎన్నిక అయిపోయిన తర్వాత ప్రయత్నాలు చేసినా అర్ధముంది. లేకపోతే ఈ పరిణామాలు రేపటి ఉపఎన్నిక మీద కచ్చితంగా పడుతుంది. ఉపఎన్నికలో తేడా వస్తే అందరూ కలిసి రేవంత్ నే బాధ్యుడిని చేయటం ఖాయం. తమకెంతో పలుకుబడి ఉందని అనుకున్న నేతలను కూడా అధిష్టానం ఒక్కరోజులో తీసి పక్కన పెడేసిన సందర్భాలు కాంగ్రెస్ లో చాలా వున్నాయని రేవంత్ మరచిపోకూడదు.