ఢిల్లీ లిక్కర్ స్కాంలో మొదటి వికెట్ పడిందా ?

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మొదటి వికెట్ పడిందా ? అందరిలోను ఇపుడిదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. లిక్కర్ స్కామ్ పై విచారణలో భాగంగా ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఉన్నతాధికారులు హైదరాబాద్ లో చాలా చోట్ల సోదాలు చేశారు. ఇందులో భాగంగానే అనేక వ్యాపారాలు చేస్తున్న వెన్నమనేని శ్రీనివాసరావు అనే వ్యాపారిని అదుపులోకి తీసుకున్నారు. ముందు సుమారు ఆరు గంటల పాటు శ్రీనివాసరావును విచారించిన ఈడీ తర్వాత అదుపులోకి తీసుకున్నట్లు ప్రకటించారు.

ఎప్పుడైతే ఈ వ్యాపారిని అదుపులోకి తీసుకున్నట్లు ప్రకటించారో వెంటనే మొదటి వికెట్ పడినట్లు అర్ధమైంది. ఇప్పటివరకు అనేకమందిని ఈడీ విచారించింది. ఒకటికి రెండురోజుల పాటు విచారించింది కానీ ఎవరినీ అదుపులోకి తీసుకున్నట్లు ప్రకటించలేదు. శ్రీనివాసరావు విషయంలోనే అదుపులోకి తీసుకున్నట్లు మొదటిసారి ప్రకటించింది. అధికార పార్టీ లోని చాలామంది కీలక వ్యక్తులతో ఈ వ్యాపారికి బాగా సన్నిహిత సంబంధాలున్నట్లు సమాచారం.

హైదరాబాద్, రంగారెడ్డి, ఖమ్మం జిల్లాల్లో ఈయనకు చాలా వ్యాపారాలున్నాయట. స్కామ్ కు సంబంధించి రు. 2 వేల కోట్ల సమీకరణలో ఈయనదే కీలకపాత్రగా ఈడీ అనుమానిస్తోంది. స్కామ్ లో ప్రధాన సూత్రధారిగా ఈడీ అనుమానిస్తున్న అరుణ్ రామచంద్ర పిళ్ళైకి శ్రీనివాసరావుకు మధ్య సోషల్ మీడియా ఖాతా ద్వారా చాలా వ్యవహారాలు నడిచినట్లు ఈడీ గుర్తించింది. పంజాబ్ ఎన్నికల సమయంలో ఒక పార్టీకి ఈ వ్యాపారి ద్వారానే సుమారు రు. 200 కోట్లు అందినట్లు ఈడీ గట్టిగా అనుమానిస్తోంది.

ఇప్పటివరకు నాలుగుసార్లు ఈడీ హైదరాబాద్ లోని అనేక మందిపై దాడులు చేసి విచారణ జరిపింది. అప్పుడెప్పుడూ శ్రీనివాసరావు విషయం వెలుగులోకి రాలేదు. కానీ సోమవారం హఠాత్తుగా వెన్నమనేని ఇల్లు, ఆఫీసులపై ఈడీ దాడులు చేయటంతో అందరు ఆశ్చర్యపోయారు. దానికి తోడు ఈయన్ను అదుపులోకి తీసుకుంటున్నట్లు ప్రకటించటంతో ఈయనెవరా అనే విషయంలో రాజకీయవర్గాల్లో ఆసక్తి పెరిగిపోతోంది. చివరకు ఏమవుతుందో చూడాలి.