పులి బిడ్డ సెంటిమెంటును ప్రయోగిస్తోందా ?

వేరేదారి లేక వైఎస్సార్టీపీ అధినేత వైఎస్ షర్మిల చివరకు సెంటిమెంటునే అస్త్రంగా ప్రయోగిస్తున్నారా ? ఇపుడిదే సందేహం అందరిలోను పెరిగిపోతోంది. తాజాగా మీడియాతో షర్మిల మాట్లాడిన మాటలు విన్నతర్వాత అందరికీ అలాగే అనిపిస్తోంది. మీడియాతో షర్మిల మాట్లాడుతు తన తండ్రి వైఎస్సార్ ను కుట్రచేసి చంపినట్లుగానే తనను కూడా చంపేస్తారేమో అని అన్నారు. తాను పులిబిడ్డనని తాను ఎవరికీ భయపడేది లేదని పదే పదే చెప్పారు.

షర్మిల వ్యాఖ్యలపై జనాల్లో రెండు ప్రశ్నలు మొదలయ్యాయి. అవేమిటంటే వైఎస్సార్ హత్యకు ఎవరు కుట్రపన్నారు ? దాన్ని ఎవరు అమలుచేశారు ? కుట్రచేసి హత్యచేశారని ఆరోపణలు చేస్తే సరిపోదు. కుట్రపన్నింది ఎవరు ? హత్యచేసింది ఎవరనే విషయాలను కూడా షర్మిలే చెప్పాల్సుంటుంది. 2009లో వైఎస్సార్ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన విషయం అందరికీ తెలిసిందే. అప్పట్లోనే దీన్ని హత్యాగా వైఎస్ కుటుంబసభ్యులే అనుమానం వ్యక్తంచేశారు.

అయితే వైఎస్ మరణంపై నియమించిన కమిటి ఎలాంటి కుట్ర జరగలేదని కేవలం వాతావరణంలో మార్పుల వల్లే ప్రమాదం జరిగిందని తేల్చింది. దాంతో వైఎస్ మరణం హత్యంటు మళ్ళీ ఎవరు మాట్లాడలేదు. అలాంటిది ఇన్ని సంవత్సరాల తర్వాత షర్మిల ఆరోపించటమే ఆశ్చర్యంగా ఉంది. సరే వైఎస్సార్ విషయాన్ని వదిలేస్తే షర్మిలను చంపటానికి ఎవరు కుట్రచేస్తారు ? ఎవరికి అవసరం ?

ఇక్కడ గమనించాల్సిందేమంటే షర్మిల తననుతాను చాలాఎక్కువగా ఊహించుకుంటున్నారేమో అనిపిస్తోంది. మీడియా సమావేశంలో బీడీలను చూపించి దమ్ముంటే తనను అరెస్టు చేయండని పదే పదే కేసీయార్ నా చాలెంజ్ చేయటమే ఆశ్చర్యంగా ఉంది. అంటే కేసీయార్ ను రెచ్చగొట్టి తాను అరెస్టవ్వటం ద్వారా జనాల సానుభూతిని పొందాలని షర్మిల అనుకుంటున్నారా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. కుట్రచేసి హత్యచేశారు, తనను కూడా హత్యచేస్తారేమో అనే వ్యాఖ్యలన్నీ సానుభూతి కోసమే అని అర్ధమవుతోంది. మరి జనాలు ఎలా రెస్పాండ్ అవుతారో ?