అమిత్ షా సీరియస్ అయ్యారా ?

కేంద్రప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన తెలంగాణా విమోచన దినోత్సవ కార్యక్రమంలో హాజరైన హోంశాఖ మంత్రి అమిత్ షా నేతలపై బాగా సీరియస్ అయినట్లు సమాచారం. విమోచన దినోత్సవ కార్యక్రమం అయిపోయిన తర్వాత ప్రత్యేకించి బీజేపీ నేతలతో సమావేశమయ్యారు. ఈ సమావేశం ప్రధానంగా మునుగోడు అసెంబ్లీ ఉపఎన్నికలో గెలుపు విషయంపైనే జరిగింది. ఈ సమావేశంలో నేతల తీరుపై బాగా మండిపడినట్లు సమాచారం.

కారణం ఏమిటంటే మునుగోడులో బీజేపీ కచ్చితంగా గెలుస్తుందనే వాతావరణం లేకపోవటమే. కాంగ్రెస్ ఎంఎల్ఏ కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డిని బీజేపీలోకి లాక్కునే ఉద్దేశ్యంతో ఆయనతో రాజీనామ చేయించారు. తర్వాత బీజేపీలోకి చేర్చుకుని టికెట్ ప్రకటించారు. అప్పట్లో కమలనాదుల ఉద్దేశ్యం ఏమిటంటే ఉపఎన్నిక షెడ్యూల్ ప్రకటించటం, నామినేషన్ వేయటమే ఆలస్యం రాజగోపాలరెడ్డి గెలిచినట్లే అనుకున్నారు. కానీ ఇపుడు సీన్ చూస్తుంటే మాజీ ఎంఎల్ఏ గెలుపు అనుమానమే అని తేలిందట.

దీనికి కారణం ఏమిటంటే రాజగోపాలరెడ్డితో పాటు ఆయన క్యాడర్లో చాలామంది కాంగ్రెస్ లోనే ఉండిపోయారు. బీజేపీలో తానుచేరితే తన క్యాడర్ మొత్తం బీజేపీలోకి వచ్చేస్తుందని కోమటిరెడ్డి అమిత్ షా కు చెప్పారట. తీరాచూస్తే ఎవరో కొంతమంది తప్ప మిగిలిన నేతలంతా బీజేపీలో చేరేదిలేదని చెప్పేశారట. ఎంత ప్రయత్నిస్తున్నా నేతలుమాత్రం కాంగ్రెస్ లోనే కంటిన్యు అవుతామని చెబుతున్నారట. దాంతో ఏమిచేయాలో మాజీఎంఎల్ఏకి అర్ధం కావటంలేదు. ఉపఎన్నికలో త్రిముఖపోటీ జరిగితే బీజేపీ అభ్యర్ధి గెలుపు అనుమానమే.

డైరెక్టుగా టీఆర్ఎస్-బీజేపీ ఫైట్ జరిగితే కాంగ్రెస్ ఓట్ల సాయంతో బీజేపీ గెలిచే అవకాశముంది. హుజూరాబాద్ ఉపఎన్నికలో బీజేపీ ఇలాగే గెలిచింది. త్రిముఖ పోటీ ఎక్కడ జరిగినా బీజేపీ ఓడిపోవటమే. సో ఇపుడు మునుగోడులో కూడా బీజేపీ గెలుపు అనుమానంగా మారింది. ఈ విషయంలోనే వలసలను ప్రోత్సహించటంలో బీజేపీ నేతలంతా ఫెయిలయ్యారని అమిత్ మండిపడ్డారట. కేవలం వలసలను ప్రోత్సహించటం కోసం ప్రతి గ్రామంలోను త్రిసభ కమిటీలను వేయమని ఆదేశించారట. షెడ్యూల్ వచ్చేలోగా ఇతరపార్టీల నేతలను బీజేపీలోకి చేర్చాల్సిందే అని చెప్పారు. మరి బీజేపీకి సాద్యమేనా ?