ఈయనకు టికెట్ కన్ఫర్మ్ అయినట్లే

గుంటూరు జిల్లాలోని వినుకొండ నియోజకవర్గంలో జీవీ ఆంజనేయులుకు టికెట్ కన్ ఫర్మయ్యిందని సమాచారం. చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన నియోజకవర్గ స్ధాయి సమీక్షా సమావేశంలో మాజీ ఎంఎల్ఏ జీవీ కృషిని అభినందించారు. 2014లో జీవీ పార్టీ తరపున మొదటి సారి గెలిచారు. మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయారు. ప్రతిపక్షంలోకి వచ్చినప్పటినుండి పార్టీ కార్యక్రమాలను ముందుండి బాగానే నడుపుతున్నారు.

ఇదే విషయాన్ని చంద్రబాబు కూడా ప్రస్తావించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పార్టీ ఇచ్చిన పిలుపును జీవీ నాయకత్వంలో పార్టీ క్యాడరంతా బాగా స్పందిస్తున్నట్లు చంద్రబాబు అభినందించారు. స్ధానిక సంస్ధల ఎన్నికల్లో శావల్యాపురం జడ్పీటీసీ స్ధానాన్ని పార్టీ గెలవటంలో జీవీ కృషిని ప్రత్యేకంగా అభినందించారు. తర్వాత ఇద్దరి మధ్య జరిగిన ముఖాముఖిలో వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి టికెట్ కన్ఫర్మ్ చేసినట్లు చెప్పారట.

2014 ఎన్నికల్లో గెలిచినపుడు వచ్చిన మెజారిటీ కన్నా రాబోయే ఎన్నికల్లో మరింత ఎక్కువ మెజారిటీ రావాలని చంద్రబాబు టార్గెట్ పెట్టారు. నియోజకవర్గంలోని నేతలను, కార్యకర్తలను సమన్వయం చేసుకోవాలని సూచించారు. ఆర్థికంగా జీవీకి ఎలాంటి లోటు లేదు. కాబట్టి అధికార పార్టీ అభ్యర్ధికి ధీటుగా ఎంతైనా ఖర్చలు పెట్టగల కెపాసిటీ ఉంది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేయబోయే అభ్యర్ధులకు ప్రధానంగా కావాల్సింది ఆర్ధిక అండదండలే.

ఇపుడు చంద్రబాబు ఫైనల్ చేస్తున్న అభ్యర్ధులను కూడా జాగ్రత్తగా ఫైనల్ చేస్తున్నారు. ఆర్ధికంగా బాగా స్ధితిమంతులనే చూసుకుని చంద్రబాబు ప్రకటిస్తున్నారు. కడప, రాజంపేట లోక్ సభలకు అభ్యర్ధులుగా ప్రకటించిన శ్రీనివాసులరెడ్డి, నరహరి కూడా ఆర్ధికంగా గట్టివారే. అలాగే డోన్, పుంగనూరు, పులివెందుల అసెంబ్లీలకు ప్రకటించిన అభ్యర్ధులు కూడా ఆర్ధికంగా బలమైన వారే. కాబట్టి అన్నీ కోణాలను పరిశీలించిన తర్వాతే చంద్రబాబు అభ్యర్ధులను ప్రకటిస్తున్నారు. ఇదే సమయంలో నియోజకవర్గాల్లో కచ్చితంగా వీళ్ళకు టికెట్ కోసం పోటీలేదు అని అనుకున్న విషయాన్ని కూడా చంద్రబాబు పరిగణలోకి తీసుకుంటున్నారు. మొత్తానికి మెల్లిమెల్లిగా అభ్యర్ధులను చంద్రబాబు ఫైనల్ చేస్తున్నది వాస్తవం.