రాజగోపాల్ ది సెల్ఫ్ గోలేనా ?

కాంగ్రెస్ ఎంఎల్ఏగా రాజీనామా చేసి బీజేపీలో చేరి పోటీచేయబోతున్న కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి సెల్ఫ్ గోల్ వేసుకున్నారా ? క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలను చూసిన తర్వాత అందరిలోను ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. బీజేపీ అభ్యర్ధిగా పోటీచేయబోతున్న తనను గెలిపించాలని కోరుతు రాజగోపాల్ మునుగోడు నియోజకవర్గంలోని అనేక గ్రామాల్లో పర్యటిస్తున్నారు. అయితే కొన్ని గ్రామాల్లో మాజీ ఎంఎల్ఏకి చేదు అనుభవం ఎదురవుతోంది.

మర్రిగూడెం, నాంపల్లి గ్రామాల్లో జనాలు రాజగోపాల్ ను ప్రచారానికి తమ గ్రామాల్లోకే అడుగుపెట్టనీయలేదు. మాజీ ఎంఎల్ఏ జనాలను కన్వీన్స్ చేయాలని ఎంత ప్రయత్నంచేసినా జనాలు ఒప్పుకోలేదు. తాను రాజీనామా చేస్తే కానీ మునుగోడు డెవలప్ కాదని గతంలో చెప్పారు. ప్రతిపక్షంలో ఉన్న కారణంగానే కేసీయార్ మునుగోడులో అభివృద్ధి కార్యక్రమాలు చేయటంలేదని రాజగోపాల్ పదే పదే చెప్పారు.

ఇదే కారణంతో కాంగ్రెస్ ఎంఎల్ఏ పదవికి రాజీనామా చేయటంతో ఉపఎన్నిక వస్తోంది. మరపుడు అభివృద్ధే రాజగోపాల్ నినాదమైతే చేరాల్సింది టీఆర్ఎస్ లోనే. కానీ మాజీ ఎంఎల్ఏ చేరింది మాత్రం బీజేపీలో. అంటే ఒక ప్రతిపక్షంలోని కాంగ్రెస్ కు రాజీనామా చేసి మరో ప్రతిపక్షమైన బీజేపీలో చేరారు. ఇక్కడే రాజగోపాల్ వాదన తప్పని అందరికీ అర్ధమైపోయింది. బీజేపీలో ఎందుకు చేరారంటే కాంట్రాక్టుల కోసమే చేరినట్లు అందరికీ అర్ధమైపోయింది. దాంతో జనాలు రాజగోపాల్ ను కొన్ని గ్రామాల్లో ప్రచారం చేయకుండా అడ్డుకుంటున్నారు.

తాను రాజీనామా చేయగానే అభివృద్ధి పనులకు హుజూరాబాద్ ఉపఎన్నికలో చేసినట్లే కేసీయార్ శ్రీకారం చుడతారని రాజగోపాల్ అనుకున్నారు. అయితే అలాగ జరగకపోవటంతో ఇపుడు జనాలకు ఏమిచెప్పాలో మాజీ ఎంఎల్ఏకి అర్ధం కావటంలేదు. నియోజకవర్గం డెవలప్మెంట్ కోసం కాదని కేవలం వ్యక్తిగత అవసరాల కోసమే ఎంఎల్ఏగా రాజీనామా చేసి బీజేపీలో చేరారనే ప్రచారం కూడా రాజగోపాల్ కు ఇబ్బందిగా మారింది. మరి ఉపఎన్నిక ఫలితం ఎలాగుంటుందనేది ఆసక్తిగా మారింది.