ఆ జిల్లాలో త‌ప్పు త‌మ్ముళ్ల‌దా బాబుదా..!


అవును.. ఇప్పుడు టీడీపీ నేత‌ల మ‌ధ్య ఇదే విష‌యం చ‌ర్చ‌కు వ‌స్తోంది. త‌ప్పు త‌మ్ముళ్ల‌దా.. చంద్ర‌బాబుదా అనేదే ప్ర‌శ్న‌. ప్ర‌స్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నియోజ‌క‌వ‌ర్గాల‌కు సంబంధించి చంద్ర‌బాబు ప‌రిశీల‌న చేస్తున్నారు. ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీ ప‌రిస్థితిని స‌మీక్షిస్తున్నారు. అదేస‌మ‌యంలో నేత‌ల‌కు క్లాసు ఇస్తున్నారు. ప‌రిస్థితులు మార్చుకోక పోతే.. ప‌రిణామాలు తీవ్రంగా ఉంటాయ‌ని హెచ్చ‌రిస్తున్నారు. ఓకే.. ఇంత వ‌ర‌కు బాగానే ఉంది. కానీ.. ఒక విష‌యంలో బాబు వైఖ‌రిపై నేతలు విస్మ‌యం వ్య‌క్తం చేస్తున్నారు.

ఉమ్మ‌డి కృష్నాజిల్లా గురించి..చంద్ర‌బాబు చేసిన వ్యాఖ్య‌ల‌పైనే నేత‌లు.. ఇప్పుడు దృష్టి పెట్టారు. ఇక్కడి నాయ‌కులు మారిపోయార‌ని.. పార్టీ అధిష్టానం పిలుపునిచ్చినా.. నాయ‌కులు ఇంటికే ప‌రిమితం అవుతున్నార‌ని.. చంద్ర‌బాబు అన్నారు. అంతేకాదు.. ఏదైనా ధ‌ర్నాలు.. రాస్తారోకోలు వంటి ప్ర‌జా ఉద్య‌మాలు చేప‌ట్టిన‌ప్పుడు.. కొంద‌రు నాయ‌కులు స్వ‌యంగా ముందుగానే పోలీసుల‌కు స‌మాచారం అందించి.. వారంత‌ట వారే గృహ‌నిర్బంధాలు చేయించుకుంటున్నార‌ని వ్యాఖ్యానించారు.

ఈ వ్యాఖ్య‌లు ఇప్పుడు సంచ‌ల‌నంగా మారాయి. నిజానికి నాయ‌కుల‌ను గుర్తించి.. పోలీసులు వారి ఇళ్ల‌కు వెళ్లి.. హెచ్చ‌రించ‌డం అనేది ఇటీవ‌ల కాలంలో జ‌రుగుతున్న ప‌రిణామాలే. కానీ, స్వ‌యంగా నాయ‌కులే జోక్యం చేసుకుని.. రేపు కార్య‌క్ర‌మం ఉంది.. మీ వాళ్ల‌ను ముందుగానే పంపించండి!అని క్లూ ఇచ్చి మ‌రీ.. కార్య‌క్ర‌మాల‌కు వెళ్ల‌కుండా.. ఇళ్ల‌లో గృహ నిర్బంధం చేయించుకుంటున్నార‌నేది చంద్ర‌బాబు ఆవేద‌న‌. ఆందోళ‌న కూడా! మ‌రి .. ఇత‌ర జిల్లాల్లో ఎలా ఉన్నా.. ఈ ప‌రిస్థితి కృష్ణాలో ఉంద‌ని.. బాబు వ్యాఖ్యానించారు.

దీనికి కార‌ణం ఏంటి.. ఒక్క కృష్ణా జిల్లా మాత్ర‌మే ఎందుకు ఇలా త‌యారైంది? అనేది చ‌ర్చకు వ‌స్తున్న విష‌యం. గ‌తంలో పార్టీ అధికారంలో ఉన్న‌ప్పుడు .. కూడా నేత‌లు.. పార్టీ లైన్‌కు భిన్నంగానే వ్య‌వ‌హ‌రించారు. అప్ప‌ట్లో ఒక మంత్రి త‌న చెప్పుచేత‌ల్లో పెట్టుకుని.. జిల్లాను శాసించార‌ని.. ఇప్పుడు ప్ర‌తిప‌క్షంలో ఉన్నా కూడా.. ఆయ‌నే దూకుడు చూపిస్తున్నార‌ని.. దీంతో మిగిలిన వారు అచేత‌నంగా మారిపోయార‌నే వాద‌న ఉంది. అదేస‌మ‌యంలో కొంద‌రికి మాత్ర‌మే అనుకూల మీడియాలోనూ యాక్స‌స్ ఉంద‌నే చ‌ర్చ ఉంది.

ఈ ప‌రిణామాల‌కు తోడు.. గ‌త ఎన్నిక‌ల్లో కావాల‌ని.. కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో ఓడించార‌నే వాద‌న అధిష్టానానికి ఎప్పుడో చేరింది. అలా చేసిన వారిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని.. బోడే ప్ర‌సాద్‌(పెన‌మ‌లూరు), శ్రీరాం తాత‌య్య‌(జ‌గ్గ‌య్య‌పేట‌), మండ‌లి(అవ‌నిగ‌డ్డ‌)ల నుంచి అభ్య‌ర్థ‌న‌లు వ‌చ్చాయి. అయినా.. కూడా చంద్ర‌బాబు ప‌ట్టించుకోలేదు. ఈ ప‌రిణామమే ఇప్పుడు పార్టీలో నేత‌ల‌కు అధినేత‌కు మ‌ధ్య గ్యాప్ పెరిగేలా చేసింద‌నే వాద‌న ఉంది. దీనిని బ‌ట్టి త‌ప్పు ఎక్కువ‌గా చంద్ర‌బాబు వ‌ద్దే ఉంద‌ని అంటున్నారు.