ఆ పొరపాటే కేసీఆర్ మెడకు చుట్టుకుంటుందా?

రాజకీయంగా తమకు ఎదురుండకూడదనే ఎవరైనా అనుకుంటారు. ఇందుకు ఒక్కొక్కరు ఒక్క పంథాను అనుసరిస్తారు. తెలంగాణాలో కేసీయార్ గతంలో అనుసరించిన, ఇపుడు అనుసరిస్తున్న విధానమే ఇపుడు ఆయన మెడకే చుట్టుకుంటోంది. 2014లో అధికారంలోకి వచ్చింది బొటాబొటి మెజారిటితో మాత్రమే. 119 అసెంబ్లీ సీట్లలో అప్పట్లో టీఆర్ఎస్ కు వచ్చింది 64 సీట్లు మాత్రమే.

అధికారం అందుకోవాలంటే ఏ పార్టీ అయినా 60 సీట్ల మ్యాజిక్ ఫిగర్ ను దాటాల్సిందే. అలాంటిది టీఆర్ఎస్ కు వచ్చింది మ్యాజిక్ ఫిగర్ కు మించి అదనంగా నాలుగు సీట్లు మాత్రమే. అంటే అప్పట్లో ప్రభుత్వం ఎప్పుడైనా పడిపోవచ్చన్నట్లుగా ఉండేది వాతావరణం. అందుకని సుస్ధిరత కోసం కేసీయార్ ఏమిచేసాడంటే ప్రతిపక్షాలైన కాంగ్రెస్, టీడీపీలను చీల్చి పీలికలు చేశారు. పై రెండు పార్టీల్లోని ఎంఎల్ఏలను ప్రలోభాలకు గురిచేసి లాగేసుకోవటం ద్వారా ప్రభుత్వాన్ని సుస్ధిరం చేసుకున్నారు.

అధికారంలో తనకు తిరుగుండకూడదనే కాంగ్రెస్, టీడీపీలను లేవకుండా దెబ్బకొట్టారు. దాని ఫలితంగా టీడీపీ కనుమరుగైపోతే కాంగ్రెస్ నానా అవస్థలు పడుతోంది. ఇక్కడే అసలు సమస్య మొదలైంది. టీఆర్ఎస్ అంటే పడని జనాలు, కేసీయార్ పాలనను వ్యతిరేకించే జనాలకు మరో కాంగ్రెస్, టీడీపీలు కుదేలైపోవటంతో వేరేదారిలేక బీజేపీని ఆప్షన్ గా ఎంచుకున్నారు. కాంగ్రెస్, టీడీపీల జోలికి కేసీయార్ వెళ్ళకుండా ఉండుంటే జనాలు బీజేపీని పట్టించుకునుండే వారు కాదు. బలమైన ప్రతిపక్షాలు కాబట్టి కాంగ్రెస్, టీడీపీల్లోనే దేన్నో ఒకదానికి ఓట్లేస్తుండేవారు.

కేసీయార్ చేసిన మిస్టేక్ వల్ల అప్పటినుండి బీజేపీ బలోపేతమవుతు వస్తోంది. అంటే బీజేపీ బలపడేందుకు కేసీయారే దోహదం చేసినట్లు అర్ధమవుతోంది. 2014 ఎన్నికల్లో ఏదో అవసరానికి అలా చేశారు తర్వాతైనా పద్దతిగా ఉన్నారా అంటే లేదు. 2018 ఎన్నికల్లో మంచి మెజారిటీతో అధికారంలోకి వచ్చినా తన పద్దతిని మార్చుకోలేదు. దాంతో ఇఫుడు బీజేపీ కేసీయార్ కు ఏకుమేకై కూర్చున్నది. తెలంగాణాలోనే బీజేపీని ఆపలేని కేసీయార్ జాతీయస్థాయిలో బీజేపీని ఓడిస్తానని సవాలు చేస్తుండటమే విచిత్రంగా ఉంది.