మునుగోడుపై.. కేసీఆర్ క‌సి

ఉప ఎన్నికే అయినా.. సార్వ‌త్రిక ఎన్నిక‌ను మించిపోయిన‌ట్టు క‌నిపిస్తోంది ఉమ్మ‌డి న‌ల్ల‌గొండ జిల్లాలోని మునుగోడు నియోజ‌క‌వ‌ర్గం. ఇక్క‌డ నుంచి గ‌త ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకున్న కోమటిరెడ్డి రాజ‌గోపాల్‌ రెడ్డి ఇటీవ‌ల కాంగ్రెస్‌కు రాజీనామా చేసి.. బీజేపీలోకి చేరారు. ఈ క్ర‌మంలో త‌న ఎమ్మెల్యే ప‌ద‌విని కూడా ఆయ‌న వ‌దులుకున్నారు. దీంతో మునుగోడు ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. అయితే.. ఇది అధికార పార్టీ జీవ‌న్మ‌ర‌ణ స‌మ‌స్య కావ‌డంతో ఇక్క‌డ నుంచి గెలిచి తీరాల‌నే క‌సి క‌నిపిస్తోంది.

ఈ క్ర‌మంలోనే ఆయ‌న మునుగోడులో గులాబీ జెండా ఎగ‌రాల‌నే ల‌క్ష్యంతో చాలా వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. బీజేపీ, కాంగ్రెస్‌ల‌ను ధీటుగా ఎదుర్కొంటూ ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు అన్నిప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే మంత్రి జగదీశ్‌రెడ్డి సహా ఇతర నేతలు నియోజకవర్గంలో ఉండి ఉపఎన్నికకు పార్టీ శ్రేణులను సంసిద్ధులను చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పలుమార్లు ఉపఎన్నికకు సంబంధించి నేతలతో స‌మీక్ష చేస్తూ దిశానిర్దేశం చేస్తున్న విష‌యం తెలిసిందే.

వాస్త‌వానికి ఉప ఎన్నిక‌కు షెడ్యూల్ విడుద‌ల కాలేదు. అయిన‌ప్ప‌టికీ.. ఈ నెల 15 నుంచి క్షేత్రస్థాయి కార్యాచరణ చేపట్టాలని కేసీఆర్‌ ఆదేశించారు. వంద మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలకు ఎన్నికల పర్యవేక్షణ, ప్రచార బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించారు. మునుగోడు నియోజకవర్గంలో మునుగోడు, నాంపల్లి, సంస్థాన్‌ నారాయణపురం, మర్రిగూడ, చౌటుప్పల్‌, చండూరు మండలాల్లో 159 గ్రామాలున్నాయి.

వాటిలో రెండువేలకుపైగా జనాభా ఉన్న 15 మేజర్‌ గ్రామపంచాయతీలున్నాయి. చౌటుప్పల్‌, చండూరు పురపాలికల పరిధిలో 30 వార్డులున్నాయి. రేండేసి గ్రామాలు, వార్డుల లెక్కన 85 యూనిట్లు, 2000కి పైగా జనాభా ఉన్న గ్రామాలను 15 యూనిట్లుగా చేసి మొత్తంగా మునుగోడును వంద యూనిట్లుగా గుర్తించారు. ఈ క్ర‌మంలో ఆయా యూనిట్ల‌లో టీఆర్ ఎస్ నాయ‌కులు మ‌కాం వేసి మ‌రీ ప్ర‌చారం చేయాల‌ని నిర్ణ‌యిం చిన‌ట్టు తెలిసింది.

టీఆర్ ఎస్‌కు 103 మంది ఎమ్మెల్యేలు, 36 మంది ఎమ్మెల్సీలు, 17 మంది ఎంపీల బలం ఉంది. వారిలో నుంచి 100 మందిని ఎంపిక చేసి గ్రామాలు, వార్డుల బాధ్యతలను అప్పగించనున్నారు. శాసనసభ సమావేశాల అనంతరం ఒక రోజు విరామం తర్వాత.. వారు నిర్దేశిత గ్రామాలకు వెళ్లి కార్యకర్తలను కలిసి కార్యాచరణ ప్రణాళికను వివరించనున్నారు. వీరికి తోడుగా జడ్పీ ఛైర్‌పర్సన్లు, కార్పొరేషన్ల ఛైర్మన్లు, ఇతర నేతలు ఆయా గ్రామాల్లో పార్టీ నిర్దేశించిన బాధ్యతల్లో ఉంటారు. వీరి ల‌క్ష్యం అంతా కూడా.. మునుగోడు నియోజ‌క‌వ‌ర్గంలో టీఆర్ఎస్ జెండాను ఎగుర‌వేయ‌డ‌మే.. ఇదీ.. సంగ‌తి!!