కేసీఆర్ నినాదం సాధ్యమేనా?

బీజేపీ ముక్త్ భారత్ సాధించాలి అన్నది కేసీఆర్ తాజా నినాదం. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ను కలిసిన సందర్భంగా మీడియా సమావేశంలో కేసీఆర్ పై నినాదాన్ని ప్రకటించారు. ఒకపుడు బీజేపీ ప్రకటించిన కాంగ్రెస్ ముక్త్ భారత్ నినాదాన్ని కాస్త తిప్పి బీజేపీకి వ్యతిరేక నినాదాన్ని చేశారు. అప్పట్లో తాను ప్రకటించిన కాంగ్రెస్ ముక్త్ భారత్ నినాదాన్ని బీజేపీ దాదాపు సాధ్యం చేసి చూపించింది.

దేశంలోని 29 రాష్ట్రాల్లో కాంగ్రెస్ రాజస్థాన్, ఛత్తీస్ గఢ్ లో తప్ప ఇంకెక్కడా అధికారంలో లేదు. పార్లమెంటులో కూడా కాంగ్రెస్ బలం 54 సీట్ల కనీస స్థాయికి పడిపోయింది. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరిస్ధితి ఏమవుతుందో ఎవరు చెప్పలేరు కానీ ఇప్పటికైతే బీజేపీ నినాదం సక్సెస్ అయినట్లే అనుకోవాలి. మరి ఇదే సమయంలో బీజేపీ బాహుబలి స్థాయిలో రాష్ట్రాల్లో అయినా పార్లమెంటులో అయినా అమితబలంగా కనబడుతోంది.

ఇలాంటి నేపథ్యంలో కేసీఆర్ బీజేపీ ముక్త్ భారత్ నినాదం ఎలా సక్సెస్ అవుతుంది ? దేశంలో నరేంద్ర మోదీ పాలనపై వ్యతిరేకత ఉందన్నది వాస్తవం. అయితే ఆ వ్యతిరేకతను అడ్వాంటేజ్ గా తీసుకునే ప్రతిపక్షాలు లేవు. నాన్ ఎన్డీయే పక్షాల్లో ఎన్నో గొడవలున్నాయి. కాంగ్రెస్ నాయకత్వాన్ని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ అంగీకరించదు. మమత నాయకత్వాన్ని కాంగ్రెస్ ఒప్పుకోవటం లేదు. అలాగే తానే ప్రధానమంత్రి అభ్యర్థి అవ్వాలని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కు బలంగా ఉంది. దీన్ని కాంగ్రెస్ అంగీకరించటం లేదు.

ఇదే సమయంలో కాంగ్రెస్ భాగస్వామ్యాన్ని కేసీఆర్ ఇష్టపడటంలేదు. జాతీయ పార్టీ లేకుండా జాతీయ స్థాయిలో ఎన్డీయేని ఢీకొనటం సాధ్యం కాదన్న విషయాన్ని కేసీఆర్, మమత ఒప్పుకోవటం లేదు. ఈ ప్రాంతీయ పార్టీల కూటమిని జనాలు ఆమోదించటం లేదు. ఇన్ని గొడవల మధ్య బీజేపీ ముక్త్ భారత్ అని కేసీఆర్ నినాదం ఇవ్వగానే జనాలు మోడీకి వ్యతిరేకంగా ఓట్లేసేస్తారా?