మోడీ గోల్ మాల్ ప్ర‌ధాని: కేసీఆర్

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీపై నిత్యం విరుచుకుప‌డే తెలంగాణ సీఎం కేసీఆర్ తాజాగా.. క్యామెడీ పంచ్‌లు రువ్వారు. బీజేపీని పారద్రోలి కేంద్రంలో రైతు ప్రభుత్వం రాబోతోందని చెప్పారు. గోల్‌మాల్‌ ప్రధాని అంటూ.. పంచ్‌లు వేశారు. ఆయ‌న‌ చెప్పేవన్నీ అబద్ధాలేనని ఆరోపించారు. దేశంలోని రైతులు సాగుకు వాడే విద్యుత్‌ 20.8 శాతమేనని తెలిపారు. దేశంలో సాగుకు వాడే విద్యుత్‌ ఖరీదు రూ.1.45 లక్షల కోట్లు అని వెల్లడించారు. కార్పొరేట్‌ దొంగలకు దోచి పెట్టినంత సొమ్ము కాదని విమర్శించారు. మోటార్లకు మీటర్లు పెట్టాలన్న మోడీకే మీటర్‌ పెట్టాలని వ్యంగ్యాస్త్రాలు రువ్వారు.

ఇటీవల జాతీయ రైతు నాయకులు నన్ను కలిశారు. జాతీయ పార్టీలోకి రావాలని కోరుతున్నారు. గుజరాత్‌ మోడల్ అని చెప్పి దేశ ప్రజలను దగా చేస్తున్నారు. గ్యాస్‌, డీజిల్‌, పెట్రోల్‌ ధరలు అడ్డగోలుగా పెంచారు. రూ.లక్షల కోట్ల మేర కుంభకోణాలు చేస్తున్నారు. మద్యపానం నిషేధం విధించిన రాష్ట్రంలో కల్తీ మద్యం ఏరులై పారింది. కల్తీ మద్యంతో 70 మంది మృతికి కేంద్రం జవాబు చెప్పాలి. కేంద్ర ప్రభుత్వ హయాంలో దోపిడీ తప్ప మరొకటి లేదు. 60 ఏళ్లు కొట్లాడి తెలంగాణ ఆత్మగౌరవం సాధించాం. దేశ ఆర్థిక విలువ దిగజార్చి.. రూపాయి విలువ పతనం చేశారు. మోసపోతే గోసపడుతాం.. అని సెంటిమెంటును కూడా ర‌గిలించారు.

పెద్దపల్లిలోని ప్రతి గ్రామ పంచాయతీకి నిధులు అందుతాయని సీఎం కేసీఆర్ తెలిపారు. గ్రామ పంచాయతీలకు రూ.10 లక్షల చొప్పున నిధులు కేటాయించినట్లు పేర్కొన్నారు. రామగుండం కార్పొరేషన్‌కు రూ.కోటి మంజూరు చేసినట్లు చెప్పారు. మూడు మున్సిపాలిటీలకు రూ.కోటి చొప్పున నిధులు మంజూరు చేస్తున్నట్లు వివరించారు. అంతకు ముందు ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దపల్లి జిల్లాలో రూ. 48 కోట్లతో నిర్మించిన సమీకృత కార్యాలయాల సముదాయాన్ని ప్రారంభించారు.

పెద్దపల్లి శివారులోని పెద్దబొంకూరు వద్ద 21 ఎకరాల సువిశాల విస్తీర్ణ స్థలంలో నిర్మించిన కార్యాలయాల సముదాయంలో ప్రత్యేక పూజలు చేశారు. తెలంగాణ ఏర్పడ్డాక కలలో కూడా ఊహించని అనేక కార్యక్రమాలు నిర్వహించామని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లాలో నిర్వ‌హించిన బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడారు. సింగరేణి కార్మికులకు భారీగా బోనస్‌ అందజేస్తున్నామన్నారు. పెద్దపల్లిలో మున్సిపాలిటీలు ఏర్పాటు చేసుకున్నామని చెప్పారు. ఇదే సందర్భంగా మోడీపై పంచ్‌ల‌తో విరుచుకుప‌డ్డారు.