ఎంపీ ర‌ఘురామ‌కు ఊర‌ట‌.. ఏపీకి షాక్‌

వైసీపీ రెబ‌ల్ ఎంపీ రఘురామ కృష్ణ రాజుకు సుప్రీంకోర్టులో భారీ ఊర‌ట ల‌భించింది. అదే స‌మ‌యంలో ఏపీ స‌ర్కారుకు బిగ్ షాక్ త‌గిలింది.  కొన్ని రోజుల కింద‌ట గచ్చిబౌలి పోలీసులు ర‌ఘ‌రామ‌పై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ అంశంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఎఫ్ఐఆర్‌పై ఎలాంటి తీవ్ర చర్యలు తీసుకోవద్దని సుప్రీంకోర్టు ఆదేశించింది. రఘురామ, ఆయన తనయుడు భరత్, భద్రతా సిబ్బందిపై గచ్చిబౌలి పోలీసులు ఎఫ్ఐఆర్‌ నమోదు చేయ‌డాన్ని సుప్రీం త‌ప్పుబ‌ట్టింది.

జస్టిస్ అబ్దుల్ నజీర్, జస్టిస్ జె.కె.మహేశ్వరితో కూడిన ధర్మాసనం తదుపరి ఉత్తర్వుల వరకు దీనిపై ఎలాంటి చ‌ర్య‌లూ తీసుకోవ‌ద్ద‌ని సూచిస్తూ.. స్టే విధించింది. రఘురామకృష్ణరాజు, ఆయన కుమారుడిపై.. ఈ ఏడాది జులై 5న హైదరాబాద్‌లోని గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు. విధి నిర్వహణలో ఉన్న ఏపీ ఇంటెలిజెన్స్‌ కానిస్టేబుల్‌ ఫరూక్‌పై దాడి చేసినందుకు ఎంపీతోపాటు ఆయన కుమారుడు భరత్‌, పీఏ శాస్త్రి, సీఆర్‌పీఎఫ్‌ ఏఎస్ఐ, కానిస్టేబుల్‌పై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని  వెల్లడించారు.

మరో పక్క కానిస్టేబుల్‌ ఫరూక్‌పై దాడికి దిగిన సీఆర్‌పీఎఫ్‌ సిబ్బందిని ఉన్నతాధికారులు సస్పెండు చేశారు. ఇదిలావుంటే, రఘురామ ఇంటివద్ద ఏపీ ఇంటెలిజెన్స్‌ కానిస్టేబుల్‌ ఫరూక్‌ ఎందుకు ఉన్నాడన్న విషయమై గచ్చిబౌలి పోలీసులు, ఏపీ పోలీసులు భిన్నమైన వాదనలు వినిపించారు. గచ్చిబౌలి ఇన్‌స్పెక్టర్‌ మాట్లాడుతూ… ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎంపీ రఘురామ ఇంటివద్ద నిఘాలో భాగంగా కానిస్టేబుల్‌ ఫరూక్‌ విధులు నిర్వర్తిస్తున్నారని వెల్లడించగా… ఫరూక్‌ విధులకు, రఘురామకృష్ణరాజు ఇంటితో ఎలాంటి సంబంధం లేదని ఏపీ పోలీసు విభాగం పేర్కొనడం గమనార్హం.

దాడి జరిగిన సమయంలో ఎంపీ రఘురామ అక్కడే ఉన్నారా, లేదా? అనే అంశంపై దర్యాప్తు చేస్తున్నా మని గచ్చిబౌలి ఇన్‌స్పెక్టర్‌ చెప్పారు. ఎస్‌.ఫరూక్‌ బాషా ఆంధ్రప్రదేశ్‌ ఇంటెలిజెన్స్‌ విభాగంలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ప్రధాని మోడీ ఏపీ పర్యటన నేపథ్యంలో ఎంపీ రఘురామ కృష్ణరాజు, ఆయన అనుచరులపై నిఘా ఉంచాలన్న ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఫరూక్‌ గచ్చి బౌలి బౌల్డర్‌హిల్స్‌ కాలనీ ప్రధాన ద్వారంవద్ద విధులు నిర్వర్తిస్తున్నారని తెలిపారు.

అదే సమయానికి కాలనీ లోపలి నుంచి ఓ కారులో (7777 నెంబరు కలిగిన తెలుపు రంగు ఫోర్డ్‌ ఎకో స్పోర్ట్స్‌) వచ్చిన ముగ్గురు వ్యక్తులు ఫరూక్‌ను బలవంతంగా ఆ వాహనంలో ఎక్కించుకుని ఎంపీ ఉంటున్న విల్లాలోకి తీసుకెళ్లారు. తాను పోలీస్‌ కానిస్టేబుల్‌నని చెబుతూ ఐడీ కార్డు చూపినా… పట్టించుకోకుండా ఇష్టానుసారంగా దూషిస్తూ సీఆర్‌పీఎఫ్‌ సిబ్బంది దాడి చేశారు. ఈ క్ర‌మంలోనే ఎంపీ, ఆయ‌న కుమారుడు.. పీఏల‌పై కేసు న‌మోదు చేశారు. అయితే.. దీనిపై ఎలాంటి చ‌ర్యలూ తీసుకోవ‌ద్ద‌ని.. సుప్రీం కోర్టు ఆదేశించ‌డం గ‌మ‌నార్హం.