కేసీఆర్‌ రాజ‌కీయం ఔట్: అమిత్ షా

తెలంగాణలోని మునుగోడు అభివృద్ధికి మోడీ సర్కారు కట్టుబడి ఉంటుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. మునుగోడులో నిర్వహించిన బీజేపీ సమరభేరిలో పాల్గొన్న అమిత్షా.. ఇటీవ‌ల కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన కోమ‌టిరెడ్డి రాజగోపాల్రెడ్డిని కాషాయ కండుపా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాజగోపాల్‌రెడ్డిబీజేపీలో చేరడం అంటే ఒక నాయకుడు చేరినట్లు కాదని.. కేసీఆర్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ఇదే నాంది అని వివరించారు. తెలంగాణలో బీజేపీ సర్కార్ వచ్చి తీరుతుందని ఉద్ఘాటించారు.

ప్రభుత్వం ఏర్పడ్డాక సెప్టెంబర్ 17ను ఉత్సవంగా జరుపుతామని వెల్లడించారు. ఎన్నికల్లో టీఆర్ ఎస్‌కు ఓటేస్తే.. ఎన్నిసార్లయినా కేసీఆర్ లేదా కేటీఆర్ సీఎం అవుతారు కానీ.. దళితుడు ముఖ్యమంత్రి కాలేడన్నారు. కేసీఆర్‌, ఆయన కుమారుడు, కుమార్తె, అల్లుడు పదవుల్లో ఉంటే తమకు బాధ లేదన్న అమిత్షా.. వారి కుటుంబ పాలన వల్ల ప్రజలు ఎందుకు బాధ పడాలని ప్రశ్నించారు.  కేసీఆర్ ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పెకిలించి సముద్రంలో పారేసేందుకు ఇది ప్రారంభమ‌ని వ్యాఖ్యానించారు. రాజగోపాల్‌రెడ్డిని గెలిపిస్తే కేసీఆర్ ప్రభుత్వం మాయం అవుతుందన్నారు.

మజ్లిస్‌కు భయపడి విమోచన దినోత్సవాన్ని కేసీఆర్ జరపడం లేదన్నారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన త‌ర్వాత‌.. సెప్టెంబరు 17ను విమోచ‌న దినంగా జరుపుతామ‌ని షా అన్నారు. కేంద్రం నిర్మించే మరుగుదొడ్లను కేసీఆర్‌ను అడ్డుకుంటున్నారని అన్నారు. దళితుడిని సీఎం చేస్తానన్న కేసీఆర్ మాట నిలబెట్టుకున్నారా? అని ప్ర‌శ్నించారు. టీఆర్ఎస్‌కు ఓటు వేస్తే.. ఎన్నిసార్లయినా కేసీఆర్‌ సీఎం అవుతారు తప్ప దళితుడు కాదన్నారు.  హుజురాబాద్‌లో చెప్పిన దళితబంధు ఎన్ని కుటుంబాలకు ఇచ్చారని నిల‌దీశారు.

దళితులకు మూడెకరాల భూమి ఇస్తానని ఇచ్చారా? అని ప్ర‌శ్నించారు. రైతులను కేసీఆర్‌ తీవ్రంగా మోసం చేస్తున్నారని అన్నారు. పీఎం ఫసల్‌ బీమాను తెలంగాణలో అమలు చేయకపోవడంతో రైతులు నష్టపోతున్నారని షా వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే ప్రతి ధాన్యం గింజను కొంటామ‌ని హామీ ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్‌ కుటుంబానికి ఏటీఎంగా మారిందని విమ‌ర్శించారు. అన్ని రాష్ట్రాలు రెండుసార్లు పెట్రోల్‌, డీజిల్ ధరలు తగ్గిస్తే కేసీఆర్‌ తగ్గించలేదని, కేసీఆర్ వైఖరి వల్ల దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధర తెలంగాణలోనే అధికంగా ఉందని వ్యాఖ్యానించారు.