ఈడీ కాక‌పోతే.. బోడీ తెచ్చుకో..: KCR

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రం తీరుపై మరోసారి విమర్శలు గుప్పించారు. నేడు అభివృద్ధికి, మతోన్మాద శక్తులకు మధ్య పోరాటం జరుగుతోందని వ్యాఖ్యానించారు. ప్రగతిశీల శక్తులు ఏకమై దుర్మార్గులను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. నల్గొండ జిల్లా మునుగోడులో నిర్వహించిన ప్రజా దీవెన సభలో కేసీఆర్ మాట్లాడారు. ”నేడు అభివృద్ధికి, మతోన్మాద శక్తులకు మధ్య పోరాటం జరుగుతోంది. మునుగోడులో ఉపఎన్నిక ఎందుకు వచ్చింది. మరో ఏడాది ఆగితే రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు వస్తాయి. ప్రగతిశీల శక్తులు ఏకమై దుర్మార్గులను తరిమికొట్టాలని చెప్పాం. టీఆర్ఎస్‌కు మద్దతు ప్రకటించిన సీపీఐకి కృతజ్ఞతలు. మునుగోడు నుంచి ఢిల్లీ వరకు ఐక్యత కొనసాగాలి.“ అని కేసీఆర్ అన్నారు.

తెలంగాణ ప్రజలకు పోరాటం కొత్త కాదన్న సీఎం కేసీఆర్ విభజన హామీలు సాధించే వరకు పోరాడుతూనే ఉంటామన్నారు. మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీని గెలిపిస్తే మోటార్లకు మీటర్లు పెడతారన్న ఆయన ప్రజలు టీఆర్ ఎస్‌ను గెలిపించి బీజేపీకి మీటర్ పెట్టాలని ఎద్దేవా చేశారు. “విభజన చట్టం ప్రకారం రావాల్సినవి ఏవీ మనకు రాలేదు. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా తేల్చమంటే.. 8 ఏళ్లుగా తేల్చటం లేదు. కృష్ణా జలాల్లో మీకు వాటా ఇచ్చేది లేదని చెప్పేందుకు అమిత్‌ షా వస్తున్నారా“ అని నిల‌దీశారు.  కృష్ణా జలాల్లో వాటా గురించి బీజేపీ నేతలు మోడీ, అమిత్ షాను ఎప్పుడైనా అడిగారా? అని ప్ర‌శ్నించారు. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా గురించి రేపు మునుగోడులో చెప్పాలని అమిత్‌షాను డిమాండ్ చేశారు.

మునుగోడు నియోజకవర్గం గతంలో ఫ్లోరైడ్‌తో ఎంత బాధ పడిందో తెలుసున‌న్నారు. ఫ్లోరైడ్‌ బాధితుడిని ఢిల్లీకి తీసుకెళ్లి చూపించినా.. మన మొర ఎవరూ వినలేదన్నారు. గతంలోని ఏ పాలకుడు మునుగోడు ఫ్లోరైడ్‌ కష్టాలను తీర్చలేదని తెలిపారు. 15 రోజులు జిల్లాలో తిరిగి ఫ్లోరైడ్‌ కష్టాలపై అవగాహన కల్పించామ‌ని కేసీఆర్ చెప్పారు. అందరి పోరాట ఫలితంగా తెలంగాణ సాధించుకున్నామ‌న్న ఆయ‌న‌… ఇప్పుడు మిషన్‌ భగీరథ జలాల ద్వారా జీరో ఫ్లోరైడ్‌ జిల్లాగా మార్చామ‌ని తెలిపారు. నల్గొండ జిల్లా నో మ్యాన్‌ జోన్‌గా మారే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరించారని, మేధావులు హెచ్చరించినా.. ఫ్లోరైడ్‌ గురించి గత పాలకులు ఆలోచించలేదని కాంగ్రెస్‌ను దుయ్య‌బ‌ట్టారు. నల్గొండ జిల్లాలో కృష్ణా నది పారుతున్నా.. ప్రజలకు తాగునీళ్లు అందలేదన్నారు.

రైతులకు అనవసరంగా డబ్బులు పంచిపెడుతున్నామని బీజేపీ నేతలు నిలదీశారని, రైతుబంధు, పింఛన్లు ఎందుకు ఇస్తున్నారని మమ్మల్ని ప్ర‌శ్నించార‌ని కేసీఆర్ అన్నారు. రైతుబంధు, రైతు బీమాలాంటి పథకాలు బంద్‌ పెట్టాలని అంటున్నారని చెప్పారు. మీటర్లు పెట్టమనే బీజేపీ కావాలా?, మీటర్లు వద్దనే టీఆర్ ఎస్‌ కావాలా తేల్చుకోవాల‌ని ప్ర‌జ‌ల‌ను కోరారు. మునుగోడులో బీజేపీని గెలిపిస్తే రేపు మోటార్లకు మీటర్లు పెడతారన్నారు. మునుగోడులో బీజేపీకి ఎప్పుడూ డిపాజిట్లు రాలేదని తెలిపారు. ఈసారి బీజేపికి ఓటు పడిందంటే.. బాయి మోటార్లకు మీటర్లు పడతాయని హెచ్చ‌రించారు. ప్రజల బలం చూసుకునే.. నేను మీటర్లు పెట్టనని కేంద్రంతో పోరాడుతున్నాన‌ని కేసీఆర్ వ్యాఖ్యానించారు.

“ఏక్‌నాథ్ షిండేలను తీసుకువస్తామని బెదిరిస్తున్నారు. అన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూలదోయాలని చూస్తున్నారు. ఈడీని పంపిస్తామని బెదిరిస్తున్నారు. ఈడీ కాకపోతే బోడీ తెచ్చుకో. మోడీ గర్వమే ఆయనకు శత్రువు అవుతుంది. దేశ రాజధానిలోనే సరిగా నీళ్లు, కరెంట్‌ లేని పరిస్థితి. ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్‌లోనూ కరెంట్‌ లేదు“ అని కేసీఆర్ నిప్పులు చెరిగారు.