లైన్ దాటిన ఉద్యోగసంఘాల నేత

ఉద్యోగుల సమస్యలపైన ప్రభుత్వంతో మాట్లాడటం, వాటిని పరిష్కరించేట్లుగా చేయటమే ఉద్యోగసంఘాల నేతల పని. అంతేకానీ ప్రభుత్వాన్ని కాపాడుకోవాలని ఉద్యోగులకు, ప్రజలకు పిలుపివ్వటం కాదు. ఇపుడీ టాపిక్ ఎందుకంటే ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెంకటరామిరెడ్డి లైన్ దాటారు కాబట్టే చెప్పుకోవాల్సొస్తోంది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల కార్యవర్గ సమావేశం జరిగింది. ఆ సమావేశం రెడ్డి మాట్లాడుతు ప్రజలకు మంచిచేసే ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు.

జడ్జీలపై వాట్సప్ గ్రూపుల్లో మెసేజీలు పెడితే మూడునెలలు బెయిల్ రాదని కానీ ముఖ్యమంత్రిని నోటికొచ్చినట్లు తిడితే గంటలోనే బెయిల్ వచ్చేస్తోందన్నారు. జడ్జీలకే ఆత్మాభిమానం ఉంటుందా ? సీఎంకు ఉండదా ? అని రెడ్డి ప్రశ్నించారు. ఇక్కడ ఈ ఉద్యోగనేత మరచిపోయిన విషయం ఒకటుంది. అదేమిటంటే తమకు ఈ ప్రభుత్వంలో మంచి జరుగుతోందని ప్రజలు అనుకుంటే కచ్చితంగా ఎన్నికల్లో ఓట్లేసి గెలిపించుకుంటారు.

2019 ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వం వల్ల ఉపయోగం లేదని అనుకోబట్టే జనాలు వైసీపీకి అఖండవిజయాన్ని అందించారు. అప్పుడుకూడా ఎన్నికలకు ముందు ఇపుడు రెడ్డి చెప్పినట్లుగానే అప్పట్లో ఉద్యోగనేతలు చెప్పారు. కానీ ఉద్యోగులు, జనాలు వాళ్ళు చెప్పిన మాటలను విన్నారా ? రేపు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అన్యాయం జరుగుతోందని జనాలు అనుకుంటే కచ్చితంగా ఓడగొడతారు. ఒకపార్టీని గెలిపించటంలోను ఓడించటంలోను జనాలకు ఎలాంటి మొహమాటాలుండవు. కాబట్టి జగన్ ప్రభుత్వాన్ని కాపాడుకోవాలని రెడ్డి పిలుపివ్వటమే విచిత్రంగా ఉంది.

ఇక జడ్జీలకు వ్యతిరేకంగా మెసేజులు పెడితే మూడునెలలు జైలు, సీఎంను తిడితే ఒక్కరోజులోనే బెయిలంటు బాధపడ్డారు. ఇక్కడ గమనించాల్సిందేమంటే జడ్జీలిచ్చే తీర్పులపై ఎవరైనా తమ అభిప్రాయాలు చెప్పవచ్చు. కానీ వ్యక్తిగతంగా జడ్జీలను దూషించకూడదంతే. జడ్జీలైననా, సీఎంను అయినా వ్యక్తిగతంగా దూషించకూడదని మాత్రమే రెడ్డి చెప్పాలి. ఉద్యోగుల సమస్యలు, వాటి పరిష్కారాలపైన మాత్రమే ఉద్యోగుల నేతలు దృష్టిపెడితే బాగుంటుంది. అభిమానముంటే లోపల్లోపల చూపించుకోవాలి. అంతేకానీ రాజకీయనేతల్లాగ బహిరంగంగా పిలుపిస్తే అభాసుపాలవ్వటం ఖాయం.