ప్రభుత్వాన్ని కమ్మ నేతలు ప్రశ్నించకూడదా?

కులం పేరుతో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణపై సోషల్ మీడియాలో పోస్టులు వెలువడుతున్న సంగతి తెలిసిందే. కమ్మ సామాజిక వర్గానికి చెందిన రామకృష్ణ…టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తూ వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారంటూ సోషల్ మీడియాలో దుష్ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో రామకృష్ణపై సోషల్ మీడియాలో జరుగుతున్న విష ప్రచారాన్ని సీపీఐ నేతలు ఖండిస్తున్నారు.

వైసీపీ కుల రాజీకీయాలకు పాల్పడుతోందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ కుల నీతిని వామపక్ష నేతలు ఎండగడుతున్నారు. ఈ నేపథ్యంలోనే తనపై సోషల్ మీడియాలో జరుగుతోన్న దుష్ప్రచారంపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు ప్రభుత్వాన్ని ప్రశ్నించడం నేరమా అని రామకృష్ణ ప్రశ్నించారు.

ప్రభుత్వాన్ని ప్రశ్నించిన తనపై ‘రామకృష్ణ చౌదరి… కమ్మనిస్టు’ అంటూ వైసీపీ నేతలు కుల దూషణకు పాల్పడుతున్నారని నిప్పులు చెరిగారు. కులం పేరిట బ్లాక్‌ మెయిల్‌ చేస్తున్నారంటూ వైసీపీ నేతలపై మండిపడ్డారు.

ఆ మాటకొస్తే రాష్ట్రంలోని మూడు ప్రాంతాలను విభజించి రెడ్లకు, తన బంధువులకు సీఎం జగన్ అప్పగించారని రామకృష్ణ ఆరోపించారు. ఏపీలోని 13 జిల్లాలను విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డిలకు పంచారని ఆరోపించారు.

వీరందరికీ ఓవరాల్‌ ఇన్‌చార్జి జగన్ రెడ్డి అని, వైసీపీలో రెడ్లకు, సీఎం బంధువులకు తప్ప వేరే కులాలకు చెందిన సమర్థులకు పదవులు, బాధ్యతలు దక్కవా అని ప్రశ్నించారు. ఇంతా చేసి సామాజిక న్యాయం గురించి వైసీపీ నేతలు మాట్లాడుతున్నారని నిప్పులు చెరిగారు. 13 యూనివర్సిటీల్లో 130 మందిని ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ సభ్యుల ఓపెన్ కోటా నియామకాల్లోని 70 మందిలో 46 మంది రెడ్లేనని ఆరోపించారు.

సెర్చ్ కమిటీల్లో 12 మందిలో 9 మంది రెడ్లేనని, ఒకే సామాజిక వర్గానికి చెందిన వారిని ఎలా నియమిస్తారంటూ రామకృష్ణ దుయ్యబట్టారు. రాష్ట్రంలో పెత్తందారీ వ్యవస్థను నడుపుతూ మిగతా వారిని నిమిత్తమాత్రులు, డమ్మీలుగా చేశారని, మిగతా కులాల వారికే పేరుకే మంత్రి పదవులు,ఉపముఖ్యమంత్రి పదవులు ఇచ్చారని ఆరోపించారు.