రాజాసింగ్ అరెస్ట్.. ర‌గులుతున్న రాజ‌కీయం

తెలంగాణ‌లో బీజేపీ వ‌ర్సెస్ టీఆర్ ఎస్ రాజ‌కీయం మ‌రింత రాజుకుంది. మునావ‌ర్ షో ఎఫెక్ట్‌తో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆయనను లాలాగూడ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. రేపటి మునావర్ ఫారుఖీ షోను అడ్డుకుంటాము అనడంతో.. ముందస్తుగా రాజాసింగ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంత్రి కేటీఆర్ ఆహ్వానం మేరకే మునావర్ హైదరాబాద్  వస్తున్నారని అధికార పార్టీ నేత‌లు చెబుతున్నారు. అయితే.. దీనిని బీజేపీ తీవ్రంగా వ్య‌తిరేకిస్తోంది. ఈ నేప‌థ్యంలో మునావర్ ఫారుఖీ స్టాండప్ కామెడీ షోపై ఉత్కంఠ కొనసాగుతోంది.

ఆదివారం సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్‌లో మునావర్ ఫారుఖీ షో నిర్వహించనున్నారు. బుక్ మైషోలో మొత్తం టికెట్లను నిర్వాహకులు విక్రయించారు. వేదికను తగలబెడతామని ఇప్పటికే బీజేవైఎం, రాజాసింగ్‌ హెచ్చరించారు. దీంతో మునావర్ ఫారుఖీ కామెడీ షోపై సస్పెన్స్ కొనసాగుతోంది. శిల్పకళా వేదికను నిర్వాహకులు బుక్ చేసుకున్నారు. ఇప్పటివరకు అడ్వాన్స్ అమౌంట్‌ నిర్వాహకులు చెల్లించలేదు. కామెడీ షోలో హిందూ దేవతలను అవమానిస్తున్నారని మునావర్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌లో అనుమతి ఇవ్వొద్దంటూ బీజేవైఎం నేతలు డీజీపీ ని సైతం కలిశారు.

అయినా కూడా ఈ షోకు అనుమతి లభించింది. ఆదివారం షో జరగనుండటంతో తెలంగాణలో ఏం జరుగుతుందో అనే చ‌ర్చ జ‌రుగుతోంది. ఒకే రోజు అటు మునుగోడులోనూ.. అధికార పార్టీ టీఆర్ ఎస్‌, ప్ర‌తిప‌క్ష బీజేపీలు భారీ బ‌హిరంగ స‌భ‌ను నిర్వ‌హిస్తున్నాయి. ఈ నేప‌థ్యానికి తోడు మునావ‌ర్ షో.. మ‌రింత కాక రేపుతోంది. ఇదిలావుంటే.. వివాదాల నేప‌థ్యంలో కర్ణాటక సర్కార్  మునావర్ షోను ఇప్పటికే బ్యాన్ చేసింది.

రాజాసింగ రియాక్ష‌న్ ఏంటంటే..

మునావర్ షోకు అనుమతి ఇవ్వొద్దని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్  ఇప్పటికే హెచ్చరిస్తూ వస్తున్నారు. షోకు అనుమతి ఇస్తే వేదికను తగలబెడతామన్నారు. ఏం జరిగినా ప్రభుత్వానిదే బాధ్యత అని రాజాసింగ్ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. ‘‘మునావర్ ఫారుకీ షోను అడ్డుకుని తీరుతాం. ధర్మాన్ని కాపాడే క్రమంలో పార్టీ సస్పెండ్ చేసినా బాధపడను. నా వల్ల పార్టీకి నష్టం జరుగుతోందంటే.. నుపూర్ శర్మ మాదిరి నన్ను కూడా సస్పెండ్ చేయొచ్చు. నేను సస్పెండ్ అయినా మోడీ, అమిత్ షాలకు ఫాలోవర్‌గా ఉంటాను. హిందువులకు క్షమాపణలు చెప్పాకనే.. మునావర్ ఫారుకీ షో నిర్వహించాలి. సీతారాముళ్లను కించపరిచిన వ్యక్తికి కేటీఆర్ అండగా నిలవటం శోచనీయం. షో లోపలే మునావర్ ఫారుకీని కొట్టేందుకు ప్లాన్ చేశాం. షోకి ఎంట్రీ పాస్ లను కూడా మా రామ భక్తులు సంపాదించారు. కేసీఆర్, కేటీఆర్ లు హిందూ సమాజానికి చీడ పురుగులు’’ అని పేర్కొన్నారు.