మా జగన్ మోడీ సర్కారుకు నమ్మకమైన మిత్రుడు..

ఢిల్లీలో జరిగిన కార్యక్రమానికి హాజరైన సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబును ప్రధాని మోడీ పలుకరింపు ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర రాజకీయ సమీకరణలు ప్రభావితం చేసేవిగా ఉండటమే దీనికి కారణం. అంతేకాదు.. చంద్రబాబును పెద్దగా పట్టించుకోని మోడీ తన తీరుకు భిన్నంగా ప్రవర్తించినట్లుగా వార్తలు రావటం తెలిసిందే. దీనికి కారణం లేకపోలేదు. చంద్రబాబుతో దోస్తీకి మోడీ మొదట్నించి ఆసక్తి చూపని వైనం తెలిసిందే. బీజేపీకి పాత మిత్రుడు కావటం.. ఆయనతో కలిసి వెళ్లాలని అప్పట్లో పార్టీ అధినాయకత్వం నుంచి వచ్చిన ఒత్తిడి.. సంఘ్ పరివార్ సైతం బాబు పక్షాన నిలవటంతో మోడీ అయిష్ఠంగానే ఒప్పుకున్నట్లు చెబుతారు.

ఎప్పుడైతే భారీ మెజార్టీలో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం.. తన మాటకు పెరిగిన పలుకుబడి.. చెల్లుబాటు అనంతరం బాబును ఆయన దూరంగా పెట్టటం.. ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు తెలిసినవే. అలాంటి మోడీ ప్రత్యేకంగా చంద్రబాబును పక్కకు తీసుకెళ్లి మరీ ఐదు నిమిషాల పాటు మాట్లాడటం.. చాలా మాట్లాడుకోవాల్సిన అంశాలు ఉన్నాయని.. ఢిల్లీకి రావటం లేదన్న ఆరా తీసిన వైనం తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికర చర్చకు కారణమైంది. మరీ ముఖ్యంగా ఏపీలో అయితే.. అధికార వైసీపీ నేతలకు ఈ వ్యవహారంపై ఎలా రియాక్టు కావాలన్నది అర్థం కాలేదనే చెప్పాలి.

తమ అధినేత జగన్ ను మోడీ చాలా దగ్గరకు తీస్తారని.. ఆయనకు భారీ ప్రాధాన్యత ఇస్తారన్న సంగతి తెలిసినప్పటికీ.. చంద్రబాబుకు ఉన్నట్లుండి ప్రాధాన్యత ఇవ్వటంలో ఉన్న మర్మం ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది. మొత్తంగా చంద్రబాబుకు మోడీకి ప్రాధాన్యత ఇచ్చారన్నది పచ్చ మీడియా మొదలు పెట్టిన ప్రచారంగా తేల్చి… తృప్తి పడిపోతున్న వైనం ఆసక్తికరంగా మారింది. అదే సమయంలో సోషల్ మీడియా.. వాట్సాప్ గ్రూపుల్లో జగన్ ను అభిమానించే వారు ఇప్పుడో కొత్త ప్రచారానికి తెర తీశారు. రెండు రోజుల తేడాతో ఢిల్లీకి వెళ్లిన చంద్రబాబు.. జగన్ లలో ప్రధాని మోడీ ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారో చూడండి అంటూ కొత్త వాదనలకు తెర తీశారు.

చంద్రబాబు.. జగన్ పాల్గొన్న రెండు సమావేశాలకు ప్రధానమంత్రి మోడీ హాజరు కావటం తెలిసిందే. చంద్రబాబు నిల్చొని ఉంటే.. మోడీ పలుకరించారని.. కానీ.. తమ అధినేత జగన్ ను మాత్రం.. తాను కూర్చున్న టేబుల్ వద్ద కూర్చొబెట్టుకొని మరీ మర్యాద ఇచ్చారని వారో ఫోటోను ప్రచారానికి తీసుకొచ్చారు. ప్రధాని మోడీ మర్యాద ఎవరికి ఎక్కువ దక్కిందన్న దాని గురించి వైసీపీ నేతలు.. అభిమానులు పడుతున్న ప్రయాస ఇప్పుడు విస్మయానికి గురి చేస్తోంది. నిజానికి మోడీ ఎలాంటి వారో.. ఎవరికి.. ఎప్పుడు.. ఎందుకు ప్రాధాన్యత ఇస్తారో తెలియంది కాదు.

తనకు అవసరమైతే తప్పించి అవతల వ్యక్తిని పట్టించుకోని మోడీ ప్రాపకం కోసం వైసీపీ నేతలు మరీ ఇంతలా తపిస్తున్న వైనం చూస్తే.. నవ్వాలో.. ఏడవాలో అర్థం కానిది. నిజంగానే రేపొద్దున మోడీ.. చంద్రబాబుతో పొత్తు పెట్టుకొని ఎన్నికల బరిలో దిగాలని డిసైడ్ చేస్తే జగన్ వర్గం ఏం అనగలరు. మహా అయితే.. పచ్చ మీడియా పేరుతో మరిన్ని పంచ్ లు వేయటం మినహా చేయగలిగింది ఉండదు. చంద్రబాబు.. జగన్ లలో మోడీకి నమ్మకమైన మిత్రుడు ఎవరన్న దానిపై చర్చ మొదలుపెట్టి.. దానికి సంబంధించి వాదనలు వినిపిస్తున్న వైనం షాకింగ్ గా మారింది. ఎంత మోడీ అయితే మాత్రం.. ఆయన ప్రాపకం కోసం జగన్ లాంటి నేత కోసం వారి వర్గం అంతలా పాకులాడాల్సిన అవసరం ఏమిటి? అన్నది అసలు ప్రశ్న.