కేసీఆర్ ట్రాప్‌కు చిక్కిన కేంద్రం

కేంద్ర ప్ర‌భుత్వంపై త‌న‌దైన శైలిలో పోరాటం చేస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్‌.. అనుకున్న‌ది అంతో ఇంతో సాధించారా?  కేంద్ర ప్ర‌భుత్వాన్ని త‌న ట్రాప్‌లోకి దింపేశారా?   కేంద్రంతోనే తాను చేస్తున్న త‌ప్పుల‌ను చెప్పించ‌గ‌లిగారా? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. ఎందుకంటే.. తాజాగా ఆదివారం ఢిల్లీలో ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ అధ్య‌క్ష‌త‌న చేప‌ట్టిన నీతి ఆయోగ్ మండ‌లి భేటీని కేసీఆర్ బాయ్ కాట్ చేశారు. అంతేకాదు.. నీతి ఆయోగ్‌పై తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. దానివ‌ల్ల ఎలాంటి ప్ర‌యోజ‌నం లేద‌న్నారు. అక్క‌డ‌కు వెళ్లి ప‌ల్లీకాయ‌లుతిని రావ‌డం త‌ప్ప‌.. ఏమీ లేద‌న్నారు.

అందుకే తాను వెళ్ల‌డం లేద‌ని.. అస‌లు నీతి ఆయోగ్ స‌మావేశాన్ని తాను బ‌హిష్క‌రిస్తున్నాన‌ని.. ఆయ‌న చెప్పేశారు. అయితే.. కేసీఆర్ చేసిన ఈ వ్యాఖ్య‌ల‌పై ఆచి తూచి స్పందించాల్సిన కేంద్రం.. వెంట‌నే రియాక్ట్ అయిపోయింది. నీతి ఆయోగ్ తో కీల‌క ప్ర‌క‌ట‌న చేయించింది. అయితే.. ఈ ప్ర‌క‌ట‌న‌లో కొన్ని నిజాల‌ను చెప్పేయ‌డ‌మే.. ఇప్పుడు చ‌ర్చ‌కు దారితీస్తోంది. ఆది నుంచి కేంద్రం తెలంగాణ‌కు ఏమీ చేయ‌డం లేద‌ని.. కేసీఆర్ చెబుతున్నారు. అధికార పార్టీ నేత‌లు కూడా విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. అయితే.. ఇటీవ‌ల హైద‌రాబాద్‌కు వ‌చ్చిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. తెలంగాణ‌కు కేంద్రం ల‌క్ష కోట్లు ఇచ్చింద‌ని చెప్పారు. అంతేకాదు.. తాము లెక్క‌లు అడుగుతామ‌నే భ‌యంతోనే కేసీఆర్ మాపై విమ‌ర్శ‌లు చేస్తున్నార‌ని వ్యాఖ్యానించారు.

ఇక‌, అక్క‌డితోనూ.. ఆగ‌కుండా.. రాష్ట్రంలో జ‌రుగుతున్న అభివృద్ధి అంతా కూడా .. కేంద్రం ఇస్తున్న నిధుల‌తోనే జ‌రుగుతోంద‌న్నారు., క‌ట్ చేస్తే.. ఈ వ్యాఖ్య‌ల త‌ర్వాత‌.. కేసీఆర్ స‌ర్కారుపై మిగిలిన కాషాయ పార్టీ నాయ‌కులు కూడా లెక్క‌లు చెప్పండ‌హో..! అంటూ.. ఊరూవాడా టాం టాం చేస్తున్నారు. మ‌రి దీనికి కేంద్రంతోనే స‌మాధానం చెప్పించాల‌ని అనుకున్నారో.. లేక రాజ‌కీయ వ్యూహంలో కేంద్రాన్ని నిల‌బెట్టాల‌ని భావించారో.. తెలియదు కానీ.. కేసీఆర్ నీతి ఆయోగ్‌ను అస్త్రంగా చేసుకుని దులిపేశారు.

దీంతో నీతి ఆయోగ్ ఇప్పుడు తెలంగాణ‌కు ఇచ్చిన నిధుల లెక్క‌ల‌కు చెప్పేసింది. నీటి పారుదల రంగానికి సంబంధించి గత 4 సంవత్సరాలుగా  కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి జల్ జీవన్ మిషన్ కింద రూ.3982 కోట్లను కేటాయించిందని తెలిపింది. అదనంగా 2014-2015 నుండి 2021-2022 మధ్య కాలంలో తెలంగాణకు పి ఎం కే స్ వై – ఎ ఐ బి పి – సి ఎ డి డబ్ల్యూ కింద రూ.1195 కోట్లు విడుదలయ్యాయని తెలిపింది. మ‌రి .. షా చెప్పిన లెక్క‌ల‌కు దీనికి పొంతన ఎక్క‌డుంద‌నేది తెలంగాణ మేధావులు.. అధికార పార్టీ సానుభూతి ప‌రులు అడుగుతున్న ప్ర‌శ్న‌.

అంతేకాదు.. కేంద్ర ప్రాయోజిత పథకాల కింద 2015-16లో మొత్తం కేటాయింపులు రూ. 2,03,740 కోట్లు గా ఉండగా నేడు అవి రూ. 2022-23లో 4,42,781 కోట్లకు చేరాయ‌ని నీతి ఆయోగ్ తెలిపింది. అంటే..  ఇవి కేటాయింపులు మాత్ర‌మే. ఇంకా ఇవ్వ‌లేదు. ఇచ్చినా..రాష్ట్ర ప‌థ‌కాల‌తో సంబంధం లేకుండా.. కేంద్రం అమ‌లు చేసే ప‌థ‌కాల‌కే ఖ‌ర్చు చేయాలి. మ‌రి.. రాష్ట్రానికి ప్ర‌త్యేకంగా ఇచ్చిన సొమ్ములు ఏవి? ఎక్క‌డ‌? అనేది కేసీఆర్ ప్ర‌శ్న‌. మొత్తానికి నీతి ఆయోగ్ చెప్పిన లెక్క‌ల ప్ర‌కారం.. రాష్ట్రానికి ఇప్ప‌టి వ‌ర‌కు ఇచ్చింది.. మ‌హా అయితే.. 1300 కోట్లు. ఇదే విష‌యం కేసీఆర్ కూడా చెబుతున్నారు క‌దా! మ‌రి ల‌క్ష కోట్లు ఎక్క‌డికి పోయిన‌య్‌?! సో.. మొత్తానికికేంద్రం ప‌న్నాగాన్ని.. కేసీఆర్‌.. ఆ నోటితోనే ఇలా చెప్పించార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.