హైదరాబాద్ ప్రైవేటు ల్యాబ్ ల్లో పరీక్షల్ని ఆపేశారు

అదేం దరిద్రమో కానీ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మహమ్మారి పెద్ద సవాలే విసిరింది. సమస్య ఏదైనా కానీ గల్లీ నుంచి అంతర్జాతీయం వరకు.. సదరు అంశాన్ని లోతుగా పరిశీలించే కేసీఆర్ సారు.. మహమ్మారి నిర్దారణ పరీక్షల్ని వీలైనంత ఎక్కువ నిర్వహించటం ద్వారా.. వ్యాప్తి జరుగుతున్న తీరు తెలుసుకోవచ్చన్న చిన్న లాజిక్ ఎందుకో మిస్ అయ్యారు.

లోకమంతా టెస్టుల మీద టెస్టులు పిచ్చబోలెడన్ని చేయిస్తుంటే..కేసీఆర్ మాత్రం ఆచితూచి అన్నట్లుగా చాలా పొదుపుగా టెస్టులు చేయంచిన తీరుతో విమర్శల్లో చిక్కుకున్న పరిస్థితి. అంతకంతకూ పెరుగుతున్న విమర్శలతో పాటు.. టెస్టుల్ని నిర్వహించే విషయంలో హైకోర్టు సైతం మొట్టికాయలు వేసిన చందంగా.. ఇలా చేయండంటూ ఆర్డర్ వేసిన పరిస్థితి. అయినప్పటికీ టెస్టుల విషయంపట్ల పెద్ద శ్రద్ధ చూపలేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఇదిలా ఉంటే.. ఆ మధ్యన కోర్టు చెప్పినట్లు పరీక్షలు చేసేందుకు ప్రైవేటుతో పాటు.. ప్రత్యేక పరీక్షా కేంద్రాల్ని ఏర్పాటు చేశారు.

అయినప్పటికీ అనుకున్నట్లుగా లక్ష్యాన్ని చేరని పరిస్థితి. మరవైపు పరీక్షలు చేసిన ప్రైవేటు ల్యాబులపై విమర్శలు రావటం.. అధికారులు సైతం సదరు ప్రైవేటు ల్యాబ్ ల్లో లోపాలు ఉన్నట్లుగా గుర్తించారు. 48 గంటల్లో సదరు ప్రైవేటు ల్యాబులు తమ లోపాల్ని సరిదిద్దుకోవాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో ప్రైవేటు ల్యాబ్ ల్లో పరీక్షలు జరిపేందుకు ఇచ్చిన అనుమతుల్ని నిలిపివేశారు. ఈ నెల ఐదో తేదీ వరకూ పరీక్షలు చేయొచ్చని తేల్చారు.


దీంతో.. ప్రైవేటు ల్యాబ్ లలో టెస్టులు చేయించుకోవాలనుకున్న హైదరాబాద్ వాసులకు ఇప్పుడో కొత్త చిక్కు వచ్చి పడింది. ఓపక్క ప్రభుత్వ పరీక్షా కేంద్రాల్లో ఆచితూచి అన్నట్లుగా వ్యవహరిస్తూ టెస్టులు చేస్తున్న వేళ.. ప్రైవేటులోనూ పరీక్షల్ని నిలిపివేయటం నగర జీవులకు కొత్త షాక్ గా మారింది. ఓపక్క కేసులు అంతకంతకూ పెరుగుతున్న వేళ.. ఇలాంటి చర్యలతో సామాన్యులకు మరో ఇబ్బందిగా మారుతుందని చెప్పక తప్పదు.