‘ఉచితాల’ను సుప్రింకోర్టు కంట్రోల్ చేయగలదా ?

ఇపుడిదే అంశం రాజకీయ పార్టీల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల సమయంలో జనాలకు ఎలాంటి హామీలివ్వాలనేది పూర్తిగా రాజకీయ పార్టీ ఇష్టమే. అయితే ఎన్నికల సమయంలో ఇస్తున్న హామీల అమలు అధికారంలోకి వచ్చేసరికి చాలా కష్టమవుతోంది. జనాలను ఆకర్షించటమే టార్గెట్ గా చాలా పార్టీలు బుర్రకు తోచిన హామీలిచ్చేస్తున్నాయి. చాలా పార్టీలు అధికారంలోకి రాగానే అంతకుముందిచ్చిన హామీలను గాలికొదిలేస్తున్నాయి.

ఈ అంశంపై ఇపుడు సుప్రీంకోర్టులో విచారణ మొదలైంది. బీజేపీ నేత, లాయర్ అశ్వనీ ఉపాధ్యాయ దాఖలు చేసిన పిటీషన్ పై విచారణ ప్రారంభమైంది. ఉచిత హామీలపై వైఖరి చెప్పాలంటు కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులిచ్చింది. ఎందుకంటే ఈ విషయంలో రాజకీయ పార్టీలను నియంత్రించటంలో కేంద్ర ఎన్నికల కమీషన్ చేతులెత్తేసింది. హామీలివ్వటంలో రాజకీయ పార్టీలను కంట్రోల్ చేసే అధికారాలు కమీషన్ కు లేవని స్పష్టంగా చెప్పేసింది.

ఉచిత హామీలిచ్చే విషయంలో పార్టీలే ఒక నిర్ణయానికి రావాలని కమీషన్ తేల్చిచెప్పేసింది. దాంతో సుప్రీం కోర్టు కేంద్రానికి నోటీసులిచ్చింది. అంటే కేంద్ర ప్రభుత్వమే వివిధ రాష్ట్రాల్లో అధికారాల్లో ఉన్న పార్టీలతో పాటు ప్రతిపక్షాలతో ఒక సమావేశం పెట్టుకోవాల్సుంటంది. ఉచిత హామీలపై రాజకీయంగానే అఖిలపక్ష సమావేశంలో నిర్ణయం తీసుకోవాల్సుంటుంది. అప్పుడైనా తీసుకున్న నిర్ణయానికి పార్టీలు కట్టుబడుంటాయా అన్నది అనుమానమే. ఎందుకంటే అధికారంలోకి రావాలని ప్రతిపార్టీ ప్రయత్నాలు చేస్తుంది. ప్రత్యర్ధి పార్టీకి మించి సీట్లు గెలవాలంటే జనాలను ఆకర్షించాల్సిందే. జనాలు ఆకర్షితులవ్వాలంటే ఏవో హామీలివ్వాల్సిందే. ఉచిత హామీలివ్వకపోతే జనాలు రారు, ఓట్లేయరన్నది అందరికీ తెలిసిందే.

నిజానికి ఉచిత హామీలు అభివృద్ధిని దెబ్బతీస్తున్నాయనటంలో సందేహంలేదు. ఒకవైపు ఉచిత హామీలు, సంక్షేమ పథకాలు అభివృద్ధిని దెబ్బతీస్తున్నాయని నరేంద్రమోడీ పదే పదే చెబుతున్నారు. అయితే బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, డిప్యుటీసీఎంల సమావేశంలో మాత్రం సంక్షేమ పథకాలు నూరుశాతం పక్కాగా అమలు చేయాలని ఆదేశించిన విషయం తెలిసిందే. అంటే ఉచితాలు, సంక్షేమ పథకాల గురించి రెండు రకాలుగా స్వయంగా మోడీనే మాట్లాడుతున్నారు. మరి మిగిలిన పార్టీలు మాత్రం ఉచితాలు, సంక్షేమ పథకాలను ఎందుకు దూరంగా పెడతాయి.