కొవ్వూరు వైసీపీలో ఏం జరుగుతోంది ?

హోంశాఖ మంత్రి తానేటి వనిత ప్రాతినిధ్యం వహిస్తున్న కొవ్వూరు నియోజకవర్గం సహకార బ్యాంకు ఎన్నికల ఫలితం రాష్ట్రం దృష్టిని ఆకర్షించింది. కొవ్వూరు కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంకులోని 11 డైరెక్టర్ పోస్టులకు జరిగిన ఎన్నికలో టీడీపీ గెలవటమే ఆశ్చర్యంగా ఉంది. మొత్తం అన్ని స్దానాలను ప్రతిపక్ష టీడీపీ ఏకగ్రీవంగా గెలుచుకున్న విషయంపైనే అందరి దృష్టి పడింది. ఒక పార్టీ ఏకగ్రీవంగా అన్నీ స్ధానాలు గెలిచిందంటేనే ప్రతిపక్షం లేదనే కదా అర్ధం.

వైసీపీ అధికారంలో ఉండగా స్ధానిక ఎంఎల్ఏ వనిత హోంశాఖ మంత్రిగా ఉండి కూడా వైసీపీ నామినేషన్లు కూడా వేయలేకపోయిందా ? నామినేషన్లు కూడా వేయలేకపోయిందంటేనే వైసీపీ మరీ ఇంత బలహీనంగా ఉందా అనే చర్చ పెరిగిపోతోంది. ఈ మధ్యనే జరిగిన తిరుపతి టౌన్ బ్యాంకు ఎన్నికల్లో 12 స్ధానాలను వైసీపీ ఏకపక్షంగా గెలుచుకున్న విషయం తెలిసిందే. ఇక్కడ ప్రతిపక్షంగా పోటీచేసిన తెలుగుదేశం పార్టీ చేతులెత్తేసింది.

మరిదే పార్టీ కొవ్వూరులో 11 స్దానాలను ఏకగ్రీవంగా గెలుచుకోవటమే ఆశ్చర్యంగా ఉంది. ఇక్కడే కొన్ని అనుమానాలు పెరిగిపోతున్నాయి. అసలు బ్యాంకు పాలకవర్గం ఎన్నికలో వైసీపీ పోటీ చేయలేదా ? పోటీ చేస్తే టీడీపీ అభ్యర్ధులు ఏకగ్రీవంగా ఎలా గెలిచారు ? పోటీ జరిగి టీడీపీ అభ్యర్ధులు గెలిచారంటే అర్ధముంది. కానీ ఇక్కడ టీడీపీ అభ్యర్దులు గెలిచింది ఏకగ్రీవంగా. అంటే వనిత నేతృత్వంలోని పార్టీ మరీ ఇంత బలహీనంగా ఉందా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.

అధికారంలో ఉండికూడా ప్రతిపక్షానికి చెందిన అభ్యర్ధులను ఏకగ్రీవంగా గెలిచే అవకాశాలు కల్పించారంటే పార్టీలో ఏదో జరుగుతుందోనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. పార్టీ నేతల మధ్య సమన్వయం లేదా ? అభ్యర్ధులను పోటీకి కూడా పెట్టలేనంత అసమర్ధులా నేతలు ? అనే చర్చ పెరిగిపోతోంది. అర్బన్ బ్యాంకు పాలకవర్గం ఎన్నికలో టీడీపీ గెలుపుతో ప్రభుత్వానికి ఏదో అయిపోతుందని ఎవరు అనుకోవటంలేదు. అయితే పోటీకి కూడా అభ్యర్ధులను దింపలేకపోవటం అంటే ఆశ్చర్యంగానే ఉంది.