102 స్థానాలు టీడీపీకి అనుకూల‌మా… త‌మ్ముళ్ల చ‌ర్చ‌..!

టీడీపీ ప‌రిస్థితి ప్ర‌స్తుతం ఎలా ఉంది? గ‌తానికి భిన్నంగా పార్టీ పుంజుకుందా? వ‌చ్చే ఎన్నిక‌ల్లో దూకుడు చూపించి.. అధికారం కైవసం చేసుకునే దిశ‌గా అడుగులు వేస్తోందా? అంటే.. ఔన‌నే అంటున్నారు టీడీపీ త‌మ్ముళ్లు. మ‌హానాడు త‌ర్వాత… పార్టీ పుంజుకుంద‌ని చెబుతున్నారు. ఎక్క‌డికి వెళ్లినా.. చంద్ర‌బాబు పేరు వినిపిస్తోంద‌ని అంటున్నారు. ప్రభుత్వం పట్ల ప్రజల్లో రోజురోజుకు పెరుగుతున్న వ్యతిరేకత, వివిధ కారణాల వల్ల త‌మ గ్రాఫ్ పెరుగుతోంద‌ని అంటున్నారు.

అదేస‌మ‌యంలో ఎస్సీలు, బీసీలు కూడా మ‌ళ్లీ టీడీపీవైపు మ‌ళ్లుతున్న‌ట్టు చెబుతున్నారు. కొన్ని చోట్ల ఎమ్మెల్యేల వ్యవహార శైలి, వేధింపుల కారణంగా అదికార పార్టీకి దూరమవుతున్న వర్గాలు త‌మ‌కు అనుకూలంగా మారుతున్నాయ‌ని టీడీపీ నేత‌లు అంచ‌నా వేస్తున్నారు. ఈ క్ర‌మంలో రాష్ట్రంలో ప్రస్తుతం విజయం ఖాయంగా కనిపిస్తున్న 102 నియోజకవర్గాలు ఉన్నాయ‌ని త‌మ్ముళ్లు వ్యాఖ్యానిస్తున్నారు. అంతేకాదు.. ఈ నియోజ‌క‌వ‌ర్గాల్లో గెలుపు ఖాయంగా రాసిపెట్టుకోవ‌చ్చ‌ని చెబుతున్నారు.

ఇవే కాకుండా మరో 45 నుంచి 50 నియోజకవర్గాలలో చివరి నిమిషంలో రాజకీయ వ్యూహాలు మారితే.. త‌మ‌కు అనుకూలంగా మారుతుంద‌ని దీంతో ఫలితం త‌మ‌కు అవ‌కాశం ద‌క్క‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు. అభ్యర్థుల ఎంపిక, సామాజిక సమీకరణాలు, పొత్తులు వంటి అంశాలు ఆయా నియోజకవర్గాలలో ప్రభావం చూపే అవకాశం ఉంది. మిగిలిన చోట్ల హోరా హోరీ పోరు జ‌రుగుతుంద‌ని.. అయినా ఈ ద‌ఫా గెలుపు చంద్ర‌బాబుకేన‌ని అంచనా వేస్తున్నారు.

ఇతర పార్టీల‌తో పొత్తులు కుదిరిన పక్షంలో పరిస్తితి మరింత మెరుగు పడే అవకాశం వుంద‌ని భావిస్తు న్నారు. అయితే పొత్తులతో నిమిత్తం లేకుండా నియోజకవర్గాల వారీగా కార్యాచరణ రూపొందించుకొని ముందుకు సాగాలని పార్టీ శ్రేణులు తలపోస్తున్నాయి. పొత్తులపై నిర్ణయాన్ని అధినేత ఇష్టానికి వదిలేసినట్లు పార్టీ నాయకులు చెబుతున్నారు. ప‌రిస్థితి ఇలానే ఉంటే..తమ‌కు గెలుపు ఖాయ‌మ‌ని.. అలా కాకుండా..వైసీపీ మ‌రింత డ‌బ్బులు వెద‌జ‌ల్లితే.. మాత్రం వ్యూహం మార్చుకోవాల్సిన‌ అవ‌స‌రం ఉంద‌ని భావిస్తున్నారు.