సీఎం టూరుకు నో చెప్పడం ఏంటి?

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కేంద్రంగా సరికొత్త పంచాయతీ మొదలైంది. ఆగష్టు 1వ తేదీ సింగపూర్లో ప్రపంచ నగరాల సదస్సు జరగబోతోంది. ఈ సదస్సులో పాల్గొనాల్సిందిగా కేజ్రీవాల్ కు ఆహ్వానం అందింది. సరే ఢిల్లీకి రాష్ట్ర హోదానే ఉన్నా పరిమితిమైన అధికారాలే ఉన్న విషయం తెలిసిందే. అయినా ఏ ముఖ్యమంత్రయినా విదేశీ పర్యటనలకు వెళ్ళాలంటే కేంద్ర ప్రభుత్వం అనుమతి అవసరం. అయితే ఇక్కడ కేజ్రీవాల్ కు ఒక సమస్యుంది.

అవేమిటంటే ముందుగా లెఫ్ట్ నెంట్ గవర్నర్ అనుమతి తీసుకోవాలి. కేజ్రీవాల్ ప్రభుత్వం తీసుకున్న ఏ నిర్ణయమైనా లెఫ్ట్ గవర్నర్ ఆమోదం అయితేనే అమల్లోకి వస్తుంది. ఇందులో బాగంగానే తన సింగపూర్ పర్యటనకు అనుమతించాలని లెఫ్ట్ గవర్నర్ వీకే సక్సేనాకు లెటర్ రాశారు. అయితే దాదాపు నెలన్నర రోజుల తర్వాత ఇపుడు అనుమతి నిరాకరిస్తూ సమాధానమిచ్చారు. నిజానికి విదేశీ ప్రయాణానికి వెళ్ళటానికి సీఎంలు లేఖలు రాయటం కేవలం లాంఛనం మాత్రమే.

ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి విదేశీ ప్రయాణానికి అనుమతి కోరుతూ లేఖలు అందినా కేంద్రం వెంటనే ఓకే చెప్పేస్తుంది. కాబట్టి ఎప్పుడూ ఏ సీఎంకు సమస్యలు ఎదురుకాలేదు. కానీ ఇక్కడ కేజ్రీవాల్ లేఖను నెలన్నరోజులు అట్లే పెట్టుకుని చివరకు అనుమతి నిరాకరించటం విచిత్రంగా ఉంది. ఇక్కడే కేజ్రీవాల్ కు కొత్త పంచాయితీ మొదలైంది. పైగా అనుమతి నిరాకరణకు కారణంగా ‘అది మేయర్ల సదస్సు కాబట్టి ముఖ్యమంత్రి హాజరు అవసరంలేదని భావించినట్లు లెఫ్ట్ గవర్నర్ చెప్పటమే ఆశ్చర్యం.

ఇక్కడ విషయం ఏమిటంటే చాలాకాలంగా కేజ్రీవాల్ కు కేంద్రానికి ఏమాత్రం పడటం లేదు. ఢిల్లీ సీఎంను ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా నరేంద్ర మోడీ సర్కార్ లెఫ్ట్ నెంట్ గవర్నర్ ను ముందు పెట్టి వ్యూహాలు రచిస్తోంది. దాన్ని ఎప్పటికప్పుడు అరవింద్ తిప్పికొడుతున్నారు. ఈ నేపధ్యంలోనే కేంద్రం-కేజ్రీవాల్ మధ్య బాగా గొడవలవుతున్నాయి. సింగపూర్ పర్యటనకు తాను కచ్చితంగా హాజరైతీరుతానని కేజ్రీవాల్ ప్రకటించారు. మరి కేంద్రం ఏమి చేస్తుందో చూడాలి. అయినే… లెఫ్టినెంట్ గవర్నర్ తీసుకున్న నిర్ణయం సిల్లీగా ఉందని రాజకీయ విమర్శకులు అంటున్నారు. ఒకవేళ బీజేపీ మనసు గెలుచుకోవడానికే ఆయన చేశారనుకుందామన్నా… అది బీజేపీకి నష్టం చేస్తుందే గాని లాభం చేయదు అంటున్నారు.