వైసీపీ అంకెలు… 5 ..40.. 60.. 151..175

ఏపీ అధికార పార్టీలో అంకెల కల్లోలం రేగింది. గ‌డ‌ప గ‌డ‌ప‌కూ మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మంలో భాగంగా ఐదుగురు ఎమ్మెల్యేలు పూర్ పెర్ఫార్మ‌ర్స్ అని తేలిపోయింది. వాళ్లు తిరిగిందీ లేదు.. తిరిగి సాధించిందీ లేదు అని తేలిపోయింది. నెల‌లో ఆయ‌న ఇర‌వై రోజులు ప్ర‌జ‌ల మ‌ధ్యే ఉండ‌మంటే వీళ్లు ఆ మాట‌ను ఖాతరు చేసిన దాఖ‌లానే లేదు. ఆ విధంగా ఆ ఐదుగురిలో సీనియ‌ర్లు కూడా ఉన్నారు. పెద్దిరెడ్డి లాంటి సీనియ‌ర్లే పెద్ద‌గా ఈ కార్య‌క్ర‌మాన్ని ప‌ట్టించుకోవ‌డం లేదు అన్న వాద‌న వ‌స్తోంది. దీంతో ఆయ‌న అన‌గా జ‌గ‌న్ ఫుల్ సీరియ‌స్ అయ్యారు. పేర్లు చెప్ప‌కుండానే క్లాస్ ఇచ్చారు. నేను చేయాల్సింది నేను చేస్తున్నాను.. కానీ మీరు చేయాల్సింది మీరు చేయ‌కుండా ఉంటున్నారే! అని ప్ర‌శ్నించారాయ‌న. ఔట్ పుట్ బాలేద‌ని చెప్పేశారు.

మరో న‌ల‌భై మంది మ‌ళ్లీ పోటీ చేసినా గెలిచే సీన్ లేద‌ని తేలిపోయింది. అంటే సిట్టింగ్ ల‌కు నో ఛాన్స్.. ఇది కూడా చ‌ర్చ‌కు తావిస్తోంది.151 మందిలో 40 మంది పాల‌న‌పై, ప్ర‌జ‌ల‌పై ఎటువంటి ప్ర‌భావం చూప‌కుండా ఉన్నార‌ని కూడా తేలిపోయింది. ఇది కూడా సీఎం కోపానికి కార‌ణం అవుతోంది.

ఇక అర‌వై మంది ఎమ్మెల్యేల విష‌యానికి వ‌స్తే వీళ్లంతా పాఠ‌శాల‌ల విలీనాన్ని వ్య‌తిరేకిస్తూ సంబంధిత విద్యాశాఖ బాధ్య‌త‌లు చూస్తున్న అమాత్యులు బొత్స‌కు లేఖ‌లు రాసినవాళ్లు. వీళ్లంతా విలీనాన్ని పూర్తిగా నిర‌సిస్తూ ఉన్న‌వారు. విలీనం అన్న‌ది అనాలోచిత నిర్ణ‌యం అని తేల్చేశారు కూడా ! వాగులూ వంక‌లూ ఉన్న ప్రాంతాల్లో 200 పైగా స్కూళ్లు విలీనం కారణంగా మూత ప‌డితే వాళ్ల గ‌తేంటి .. ? హై రిస్క్ జోన్ల‌లో పాఠ‌శాల‌ల‌ను ఎలా మూస్తారు ? అని ప్ర‌శ్నిస్తున్నారు. ఇక ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు వ‌స్తే వైసీపీకి 60కి పైగా సీట్లు రావొచ్చు అన్న వాద‌న కూడా వినిపిస్తోంది. లేదా 2014 నాటి రిజ‌ల్ట్ అంటే ఆ రోజు గెలుచుకున్న 67 సీట్లే మ‌ళ్లీ రానున్నాయి అన్న అభిప్రాయం కూడా ఉంది.

కానీ సీఎం మాత్రం 2019లో 151 సీట్ల‌ను గెలుచుకున్నాం.. ఈ సారి గ‌ట్టిగా ప్ర‌య‌త్నిస్తే 175 / 175 సాధించ‌లేమా అని ప‌ట్టుబ‌డుతున్నారు. అయితే ఇవ‌న్నీ చెప్పేందుకు, వినేందుకు, రాసేందుకు బాగుంటాయి కానీ క్షేత్ర స్థాయిలో అభివృద్ధి అన్న‌ది లేకుండా ఎవ్వ‌రం ఏం చేయ‌లేం అని అధికార పార్టీ స‌భ్యులు పెద‌వి విరుస్తున్నారు. ఇక వైసీపీలో ఏక్ నాథ్ షిండే త‌ర‌హాలో పెద్దిరెడ్డి చ‌క్రం తిప్పి పార్టీని చీలుస్తార‌న్న వాద‌న కూడా వినిపిస్తోంది. అదే క‌నుక జ‌రిగే అవ‌కాశం ఉంటే జ‌గ‌న్ కు మ‌రిన్ని కష్టాలు త‌ప్ప‌వ‌నే అభిప్రాయం రాజ‌కీయ ప‌రిశీల‌కుల నుంచి వినిపిస్తోంది.