‘బ‌ట‌న్ నొక్కితే బాధ్య‌త తీరిపోదు జ‌గ‌న్ రెడ్డి’

గోదావరి వరద పరిస్థితులపై వైసీపీ ప్రభుత్వం ఏ మాత్రం అప్రమత్తంగా లేదని జనసేన అధినేత పవన్ మండిపడ్డారు. బ‌ట‌న్ నొక్కితే బాధ్య‌త తీరిపోదు జ‌గ‌న్ రెడ్డి అని ఘాటుగా వ్యాఖ్యానించారు. బాధ్య‌త తీసుకోవాల‌ని సూచించారు. బాధితులు వేలల్లో ఉంటే నామమాత్రంగా పునరావాసకేంద్రాలు ఏర్పాటు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గోదావరి వరద తీవ్రత తగ్గుముఖం పట్టినా.. ముంపు బాధితుల ఇక్కట్లు రోజురోజుకీ పెరుగుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గోదావరి వరద తీవ్రత తగ్గుముఖం పట్టినా.. ముంపు బాధితుల ఇక్కట్లు రోజురోజుకీ పెరుగుతున్నాయని పవన్‌ కల్యాణ్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

ఉమ్మడి తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో వందల గ్రామాల ప్రజలు వరద నీటి కారణంగా ఇబ్బందులు పడుతున్నార న్నారు. బాధితులు వేలల్లో ఉంటే నామమాత్రంగా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారని.. వరద పరిస్థితులపై వైసీపీ ఏ మాత్రం అప్రమత్తంగా లేదని విషయం అర్థమవుతోందని చెప్పారు. బటన్ నొక్కితే బాధ్యత తీరిపోయిందని వైసీపీ నాయకత్వం భావిస్తోందని.. మానవత్వంతో స్పందించి సహాయ చర్యలు చేపట్టాలని కోరారు. వరద బాధితులను ఆదుకోవాలని కోరితే.. రాజకీయం చేస్తున్నారని వైసీపీ నాయకత్వం చెప్పటం సిగ్గుచేటన్నారు.

ప్రభుత్వం సమస్యను పక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తోందని ప‌వ‌న్ ధ్వజమెత్తారు. ముంపు గ్రామాల ప్రజలను తరలించేందుకు ప్రభుత్వం కనీసం పడవలు, ఆహారం కూడా సమకూర్చలేకపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండేళ్ల కిందట వచ్చిన వరదల సమయంలో పడవలు, ఆహారం సమకూర్చినవారికి నేటికీ బిల్లులు చెల్లించకపోవటం వల్లే ఈ పరిస్థితులు వచ్చాయని దుయ్య బట్టారు. ప్రస్తుతం నీట మునిగిన ఇళ్ళల్లోనే వరద బాధితులు బిక్కుబిక్కుమంటూ సాయం కోసం ఎదురు చూస్తున్నారన్నారు.

అన్నపూర్ణలాంటి కోనసీమ ప్రాంతంలో ఆహార పొట్లాల కోసం పెనుగులాడుకునే పరిస్థితి కల్పించారని దుయ్యబట్టారు. జన సైనికులు ఇప్పటికీ ముంపు గ్రామాల్లో సహాయ చర్యల్లో నిమగ్నమై ఉన్నారని.. ఆహారం, పాలు, కూరగాయలు అందిస్తున్నారని తెలిపారు. వారి సేవలు అభినందనీయమని పవన్ కొనియాడారు.