మా ఎంపీతో వేగ‌లేక‌పోతున్నా.. ఎమ్మెల్యే ఫిర్యాదు!

గుంటూరు వైసీపీ రాజ‌కీయాలు తాడేప‌ల్లి ప్యాల‌స్‌కు చేరుకున్నాయి. తాజాగా న‌ర‌సారావుపేట ఎంపీపై ఒక ఎమ్మెల్యే ఘాటుగా ఫిర్యాదు చేసిన‌ట్టు పార్టీలో గుస‌గుస వినిపిస్తోంది. త‌న నియోజ‌క‌వ‌ర్గంలో ఎంపీ పెత్తనం ఎక్కువ‌గా ఉంద‌ని.. క‌నీసం త‌న‌ను కూడా ప‌ట్టించుకోవ‌డం లేద‌ని.. ఆయ‌న ఫిర్యాదు చేసిన‌ట్టు స‌మాచారం. ఇప్పుడు ఇదే విష‌యం గుంటూరులోనూ చ‌ర్చ‌కు దారితీసింది. ఇటీవ‌ల కేంద్రం నుంచి నిధులు వ‌చ్చాయి. ప‌ల్నాడు జిల్లాలో(కొత్త‌ది) గ్రామీణ ప్రాంతాల్లో రహ‌దారుల అభివృద్ధికి వీటిని వెచ్చించాలి.

అయితే.. ఎంపీ శ్రీకృష్ణ దేవ‌రాయ‌లు స్వ‌యంగా అక్క‌డ ప‌ర్య‌టించి.. అధికారుల‌తో చ‌ర్చించారు. వారి నుంచి వివ‌రాలు సేక‌రించారు. ఎక్క‌డెక్క‌డ ఎలాంటి ప‌నులు చేయించాలో కూడా తెలుసుకున్నారు. అయితే.. ఈ క్ర‌మంలో త‌న‌ను సంప్ర‌దించ‌కుండా. ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గంలో ఎలా ప‌ర్య‌టిస్తార‌నేది గుర‌జాల ఎమ్మెల్యే కాసు మ‌హేష్‌రెడ్డి వాద‌న‌. పైగా.. ఆది నుంచి కూడా ఎంపీ.. వ‌ర్గానికి ఎమ్మెల్యే వ‌ర్గానికి మ‌ధ్య వివాదాలు ఉన్నాయి. దీంతో ఇప్పుడు మ‌రింత పెరిగాయ‌ని అంటున్నారు.

ఇక‌, ఈ విషయంపై ఎంపీ కార్యాల‌యం భిన్నంగా రియాక్ట్ అయింది.. మేం చేస్తున్న‌ది.. అభివృద్ధి ప‌నులే క‌దా.. రాజ‌కీయం కాదు.. క‌దా.! అని ప్ర‌క‌ట‌న జారీ చేసింది. అంటే.. ఎమ్మెల్యేగా ఉన్న నేను.. అభివృద్ధి చేయ‌కుండా.. రాజ‌కీయం చేస్తున్నాన‌ని.. ఎంపీ అంటున్నార‌ని.. ఇది స‌రికాద‌ని.. ఆయ‌న‌ను మార్చాల్సిందేనని.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న‌కు టికెట్ ఇవ్వ‌రాద‌ని.. ఘాటుగా.. తాడేప‌ల్లి అధిష్టానానికి కాసు మ‌హేష్‌రెడ్డి లేఖ రాసిన‌ట్టు తెలిసింది.

సామాజిక వ‌ర్గం ప‌రంగా కూడా.. ఎంపీపై ఎమ్మెల్యే ఫిర్యాదులు చేసిన‌ట్టు స‌మాచారం. టీడీపీ వ‌ర్గానికి అనుకూలంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని.. త‌మ‌ను ప‌ట్టించుకోవ‌డం లేద‌ని.. క‌నీసం.. త‌మ‌ను గుర్తించ‌డం లేద‌ని.. రాజ‌ధాని రైతు నేత‌ల‌తో త‌ర‌చుగా ఫోన్లో మాట్లాడుతున్నార‌ని.. కూడా ఎమ్మెల్యే ఫిర్యాదు చేయ‌డం.. సంచ‌ల‌నంగా మారింది. ఈ నేప‌థ్యంలో తాడేప‌ల్లి అధిష్టానం.. దీనిపై ఎలా రియాక్ట్ అవుతుందో చూడాల‌ని అంటున్నారు సీనియ‌ర్ నేత‌లు.