జోరు పెంచిన రేవంత్‌.. అధికార‌మే టార్గెట్‌

తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి దూకుడు పెంచారు. గ‌తానికి భిన్నంగా పార్టీనిముందుకు న‌డిపించేందుకు ఆయ‌న వ్యూహ‌త్మ‌కంగా అడుగులు వేస్తున్నారు. పార్టీ ని బ‌లోపేతం చేయ‌డం.. ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్ల‌డం.. త‌ద్వారా.. పార్టీకి జ‌వ‌స‌త్వాలు ఇవ్వ‌డం వంటి కీల‌క ప‌రిణామాల దిశ‌గా ఆయ‌న అడుగులు వేస్తున్నారు.

ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందన్న ప్రచారం జోరందుకుంటున్న వేళ… రేవంత్‌రెడ్డి జోరు పెంచ‌డంరాజ‌కీయగా చ‌ర్చ‌కు దారితీసింది. పార్టీ ప్రక్షాళన కోసం.. బూత్ స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు పదవులను భర్తీ చేసేందుకు కసరత్తు పూర్తి చేశారు. పీసీసీ ఉపాధ్యక్షులు, కార్యదర్శులు, 36 మంది డీసీసీ అధ్యక్షులను నియమించేందుకు.. జాబితా సిద్ధం చేసి అధిష్ఠానానికి నివేదించారు.

ఇప్పటికే ఉన్న ఐదుగురు కార్యనిర్వాహక అధ్యక్షులను కూడా.. మార్చే ప్రయత్నం జరుగుతున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పార్టీ సంస్థాగత నిర్మాణం పూర్తి చేసి.. ఎన్నికలకు వెళ్లేట్లు రేవంత్‌రెడ్డి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఆపరేషన్‌ ఆకర్ష్‌ను చేపట్టి.. ఇతర పార్టీల నుంచి పార్టీలోకి చేరికలను రేవంత్‌రెడ్డి ప్రోత్సహిస్తున్నారు. బలమైన నాయకత్వం ఉన్న నియోజకవర్గాల్లో అభ్యర్థులను సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది.

ఇదే జాబితాను అధిష్ఠానానికి అందజేసినట్లు సమాచారం. సీనియర్లను కట్టడి చేసుకుంటూ.. పార్టీలో దూకుడు పెంచిన రేవంత్‌రెడ్డి … అధికార టీఆర్ ఎస్‌, బీజేపీలను డిఫెన్స్‌లోప‌డేసేలా.. 90 లక్షలు ఓట్లు వస్తాయని.. 70 స్థానాల్లో గెలిచి తీరుతామని ప్రకటించారు. కాంగ్రెస్‌కు 40లక్షలకుపైగా సభ్యత్వాలు ఉండడంతో ఒక్కో సభ్యుడు ఒక్క ఓటు వేసినా.. తాను అనుకున్న సీట్లు వస్తాయన్న ధీమాతో ఈ వ్యాఖ్యలు చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

అదేస‌మ‌యంలో ఆయ‌న అధికార టీఆర్ ఎస్‌, బీజేపీలపై విమర్శలను తగ్గించి.. తమ పార్టీ అధికారంలోకి వస్తే ఏయే వర్గాలకు ఏమి చేస్తుందో.. స్వయాన కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ సమక్షంలో పీసీసీ ప్రకటించింది. ఇప్పటికే వరంగల్‌ సభలో రైతు డిక్లరేషన్‌ ప్రకటించడంతో… పార్టీలో జోష్‌ పెరిగి.. ఏకంగా మూడు శాతం ఓటింగ్‌ పార్టీకి పెరిగినట్లు రేవంత్‌రెడ్డి వెల్లడించారు. రైతు డిక్లరేషన్‌ను రైతురచ్చబండ పేరుతో.. జనంలోకి తీసుకెళ్లి పెద్దఎత్తున ప్రచారం కల్పించారు.

ఇప్పుడు తాజాగా.. సిరిసిల్లలో ఏర్పాటు చేయనున్న విద్యార్థి నిరుద్యోగ సభలో… నిరుద్యోగ యువత డిక్లరేషన్‌ ప్రకటించేందుకు పార్టీ కసరత్తు పూర్తి చేసింది. అయితే రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసి.. వరదలు రావడంతో… వచ్చేనెల రెండో తేదీన సభ నిర్వహించడం సరికాదన్న ఆలోచనతో ఉన్న రేవంత్‌రెడ్డి… రాహుల్‌ గాంధీతో చర్చించి వాయిదా వేయించే అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనా.. తాజాగా మారుతున్న ప‌రిణామాలు.. రేవంత్ దూకుడు వంటివి పార్టీ విజ‌యంపై ఆశ‌ల‌ను పెంచుతుండ‌డం గ‌మ‌నార్హం.