టీడీపీ, జనసేన పోటీచేస్తాయా ?

మార్చిలో రాబోతున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన పోటీ చేస్తాయా ? ఇపుడిదే అంశంపై చర్చ మొదలైంది. వచ్చే మార్చిలో మూడు ఎంఎల్సీ గ్రాడ్యుయేట్ నియోజకవర్గాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో పార్టీ తరపున పోటీచేయబోయే అభ్యర్ధులను జగన్మోహన్ రెడ్డి ఫైనల్ చేసేశారు. పట్టభద్రుల నియోజకవర్గాల కోటాలో భర్తీ అవబోయే ఎంఎల్సీల సంఖ్య మూడే అయినా ఓటర్లు మాత్రం తొమ్మిది ఉమ్మడి జిల్లాల్లో ఉన్నారు.

ఈ మూడు నియోజకర్గాలు ఏమిటంటే కడప-కర్నూలు-అనంతపురం, ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు, ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు. ప్రస్తుతం ఉత్తరాంధ్ర నియోజకవర్గాల నుండి బీజేపీ నేత మాధవ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అలాగే కర్నూలు-అనంతపురం, కడప నియోజకవర్గానికి వైసీపీ నేత వెన్నపూస గోపాలరెడ్డి ఎంఎల్సీగా ఉన్నారు. ఇక ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు నియోజకవర్గానికి పీడీఎఫ్ తరపున శ్రీనివాసులరెడ్డి ఎంఎల్సీగా ఉన్నారు.

పై మూడు నియోజకవర్గాలను కచ్చితంగా గెలుచుకోవాలని జగన్ ఎంఎల్ఏలతో జరిగిన సమీక్షలో నిర్దేశించారు. రాష్ట్రపతి ఎన్నిక సందర్భంగా అసెంబ్లీకి వచ్చిన ఎంఎల్ఏలతో మాట్లాడిన తర్వాత జగన్ అభ్యర్ధులను కూడా ప్రకటించారు. ఉత్తరాంధ్ర నియోజకవర్గం నుంచి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ సుధాకర్, కడప, కర్నూలు, అనంతపురం నుంచి గోపాలరెడ్డి కొడుకు వెన్నపూస రవీంద్రారెడ్డి, చిత్తూరు, ప్రకాశం, నెల్లూరు నుండి వేర్నాటి శ్యాం ప్రసాదరెడ్డి పోటీ చేయబోతున్నారు.

వచ్చే మార్చిలో జరగబోయే ఎన్నికలు పూర్తిగా అర్బన్ ఓరియంటెడ్ గా జరగబోతోంది. ప్రతి నియోజకవర్గంలోను కొన్ని లక్షలమంది ఓటర్లుంటారు. మూడేళ్ళ జగన్ పాలనపై అర్బన్ ఓటర్ల ఆలోచనలు ఎలా ఉన్నాయనేందుకు ఒక సంకేతంగా ఉపయోగపడతాయి. మరిలాంటి ఎన్నికల్లో టీడీపీ, జనసేనలు పోటీ చేస్తాయా ? అనేది ఆసక్తిగా మారింది. గెలుపోటములు ఇక్కడ కీలకం కాకపోయినా ఓటర్ల మనోభావాలు ఎలాగున్నయన్న విషయం బయటపడుతుంది. కాబట్టి రెండు ప్రతిపక్షాలు ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటే ఎన్నిక రసవత్తరంగా మారుతుంది. మరి ఏమి చేస్తాయో చూడాలి.