ఎవ‌రివైపు నిల‌బ‌డ‌తారో తేల్చుకోండి: ప‌వ‌న్

తూర్పుగోదావరి జిల్లా చైతన్యవంతమైనదని.. రాష్ట్రంలో మార్పు రావాలంటే గోదావరి జిల్లాలతోనే సాధ్యమవుతుందని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. జనసేన కౌలు రైతు భరోసాయాత్రలో భాగంగా.. కోనసీమ జిల్లా మండపేటలో ఆత్మహత్య చేసుకున్న 52 మంది కౌలు రైతుల కుటుంబాలకు పవన్‌ ఆర్థిక సాయం అందజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడిన ఆయన.. రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించే శక్తి గోదావరి జిల్లాలకు ఉందన్నారు.

వచ్చే ఎన్నికల తర్వాత జనసేన జెండా ఎగరడం ఖాయమని, ఎవరివైపు నిలబడతారో నిర్ణయించుకోవాలని ఆ ప్రాంత ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర భవిష్యత్తు నిర్ణయించే శక్తి గోదావరి జిల్లా ప్రజలకే ఉందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. మార్పు రావాలంటే గోదవారి జిల్లాలతోనే సాధ్యమని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ఎవరివైపు నిలబడతారో నిర్ణయించుకోవాలని ప్రజలకు సూచించారు. తమ పార్టీ అభ్యర్థులను చూడొద్దని..,తనను చూడాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

గోదావరి జిల్లాల్లో మార్పు మొదలైతే పులివెందుల వరకు వెళ్తుందని అన్నారు. మార్పు కోసమే జనసేన పార్టీ వచ్చిందని.., జనవాణి పెట్టగానే వైసీపీ నేతలకు మెలకువ వచ్చిందని ఎద్దేవా చేశారు. రాష్ట్ర భవిష్యత్తు మార్చాలంటే తాను ఒక్కడే పోరాడితే సరిపోదని చెప్పారు. మీ అండదండలుంటే 2024లో కాకుంటే ఆ తర్వాతైనా అధికారంలోకి వస్తానని పవన్ అన్నారు.

చెల్లించే పన్నులనే ప్రభుత్వం ప్రజలకు ఇస్తోందని పవన్ మండిపడ్డారు. ప్రభుత్వంలో లేకున్నా కౌలురైతులకు సాయం చేస్తున్నామన్నారు. మనకు ధైర్యం లేకుంటే అరాచకమే రాజ్యం ఏలుతుందని హితవు పలికారు. ప్రభుత్వం తప్పు చేస్తే సరిచేసే బాధ్యత యువత తీసుకోవాలని సూచించారు. యువతకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు. నాయకుల వెంట జెండాలు మోసే యువత ఎందుకని ప్రశ్నించారు. నాయకులను నిలదీసే యువత కావాలన్నారు. కౌలురైతులకు గుర్తింపు కార్డులు ఇచ్చేందుకు ప్రభుత్వం ఇష్టపడటం లేదని పవన్‌ అన్నారు.