సర్వేలతో మైండ్ సెట్ మారుతుందా ?

తెలంగాణాలో రాజకీయపార్టీల వైఖరి చాలా విచిత్రంగా ఉంది. సర్వే ఫలితాలంటు ఏ పార్టీకి ఆ పార్టీ జనాల మైండ్ సెట్ మార్చుందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లున్నాయి. మొదటేమో ఆరా సంస్ధ సర్వే అంటు ఒకటి వెలుగుచూసింది. ఇందులో టీఆర్ఎస్ అధికారంలోకి రావటం ఖాయమని జోస్యం చెప్పింది. ఓట్ల శాతం తగ్గిపోతుందటకానీ అధికారం మాత్రం టీఆర్ఎస్ దే అని చెప్పింది. దాంతో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నేతలు మండిపడ్డారు.

తర్వాత మరో సంస్ధ సర్వే ఫలితాలని చెప్పి టీఆర్ఎస్ కే అధికారం అని చెప్పింది. ఇంతలో మరో సంస్ధ కాంగ్రెస్ బాగా పుంజుకుంటోంది కాబట్టి అధికారంలోకి వచ్చే అవకాశముందని చెప్పిందని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. రాజకీయ వ్యూహకర్త సునీల్ కానుగోలు ప్రకారం కాంగ్రెస్ కు 70 సీట్లు ఖాయమని మరో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెబుతున్నారు. వీళ్ళద్దరి మాటలు ఎలాగున్నా అధికారంలోకి రాబోయేది తామే అంటు బీజేపీ నేతలు పదే పదే చెబుతున్నారు.

బహుశా ఒకటి రెండు రోజుల్లో బీజేపీకి మద్దతుగా ఒక సర్వే ఫలితం వచ్చినా ఆశ్చర్యపోవక్కర్లేదు. అంటే ఇక్కడ గమనించాల్సింది ఏమంటే పార్టీలన్నీ సర్వేలు చేయించుకుంటున్నాయి. అయితే సర్వే ఫలితాలు ఎలాగున్నా బయటకుమాత్రం జనాలు తమవైపే ఉన్నారని చెప్పుకుంటు సర్వే ఫలితాలని ప్రకటనలు చేసుకుంటున్నాయి. నిజంగానే పార్టీలు చేయించుకుంటున్న సర్వేల్లో ఆయా పార్టీలకు అనుకూలంగానే ఉన్నారా అనే సందేహాలు పెరిగిపోతున్నాయి.

పార్టీలు సర్వే ఫలితాలను ప్రకటనలు చేసుకున్నంత మాత్రాన జనాల మైండ్ సెట్ మారిపోతుందా ? క్షేత్రస్ధాయిలోని జనాల్లో చాలామంది ఏ పార్టీకి ఓట్లేయాలో ముందుగానే ఫిక్సయిపోయుంటారు. పైగా ప్రతిపార్టీకి ఎంతోకొంత ఓటుబ్యాంకనేది ఉండనే ఉంటుంది. దీన్ని మినహాయిస్తే న్యూట్రల్ ఓట్లు ఎవరికి ఎక్కువగా పడితే వాళ్ళకే గెలుపు అవకాశాలుంటాయి. కాబట్టి సర్వేల పేరుతో పార్టీలు జనాల మైండ్ సెట్ మార్చలేవని గ్రహిస్తే మంచింది.